శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (20:45 IST)

మలుపులు తిరుగుతున్న వివేకా హత్య కేసు..నిజాయితీ పోలీస్ అధికారి పైనే నిందలు?

అనంతపురం జిల్లాలో  ప్రజలందరికీ సుపరిచితుడు సీఐ శ్రీరామ్. ముఖ్యంగా శాంతిభద్రతల విషయంలో ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా పని చేశారని సామాన్య ప్రజలు కితాబు ఇస్తారు. అలాంటి సిఐ ఏ కారణం లేకుండా సీఎం జగన్ రెడ్డి చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ పేరుతో అనవసరంగా వేధించారని ఆ కేసులో అనుమానితుడు శ్రీనివాస రెడ్డి సూసైడ్ నోట్లో రాసుకొని ఆత్మహత్య చేసుకోవడం సంచలనం కలిగించింది. 
 
అనంతపురం జిల్లాలో వివిధ పోలీస్స్టేషన్లో పని చేసినప్పుడు రాజకీయ ఒత్తిళ్లకు లొంగక పోవడంతో సీఐ శ్రీరామ్ ను తరచూ బదిలీలు చేయించేవారు. ధర్మవరంలో ఎస్సైగా పనిచేస్తున్నప్పుడు టీడీపీ ముఖ్య నాయకుడు , పరిటాల కుటుంబానికి అత్యంత సన్నిహితుడు  పోతుల సురేష్ ను సైతం కాలర్ పట్టుకొని స్టేషన్కు తీసుకెళ్లారు. 
 
దీంతో పోలీసు ఉన్నతాధికారులు వి ఆర్ కు పంపగా ప్రజాందోళన తో మరుసటి రోజే ధర్మవరం లోనే పోస్టింగ్ ఇచ్చారు. 
పెద్దవడుగూరు ఎస్సైగా పనిచేస్తున్నప్పుడు  రౌడీయిజం చెలాయిస్తున్న టిడిపి,  వైయస్సార్ పార్టీ నాయకులను పోలీస్ స్టేషన్కు పిలిపించి తమదైన శైలిలో కౌన్సిలింగ్ ఇవ్వడం సంచలనం కలిగించింది. 
 
ఒక దశలో అప్పటి  టిడిపి ఎమ్మెల్యే గా ఉన్న  జెసి ప్రభాకర్ రెడ్డి సైతం పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేయడానికి సమాయత్తమయ్యారు. అయితే ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని శ్రీరామ్ ను వి ఆర్ కు పంపారు. 
 
అనంతపురం నగరంలో శాంతి భద్రతలను అదుపు లోకి తేవడానికి మళ్లీ శ్రీరామ్ కు వివిధ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా బాధ్యతలు అప్పగించారు. అనంతపురం రెండవ నగర పోలీస్ స్టేషన్ ఎస్సైగా పనిచేస్తున్నప్పుడు  జెఎన్టియు యూనివర్సిటీ  పరిధిలోని స్టేట్ బ్యాంకులో దొంగలు చొరబడి బ్యాంకు నుండి ఊటీ చేశారు.
 
 ఈ వార్త దేశ వ్యాప్తంగా సంచలనమైంది. ఈ కేసులో కూడా ప్రత్యేక దర్యాప్తు బాధ్యతను శ్రీరామ్ కు అప్పగించారు. ఒక చిన్న క్లూ ఆధారంగా హర్యానా, ఢిల్లీ  తదితర చోట్ల గాలింపులు జరిపి నిందితుల అరెస్ట్ చేశారు. తన పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీలు, అక్రమ వసూళ్ల దారులు నివాసం ఉండటానికి భయపడేవారు. 
 
కాగా సి ఐ గా ప్రమోషన్ వచ్చిన తర్వాత, గత ఎన్నికల్లో పని చేసిన వారు జిల్లాలో ఉండడానికి అనర్హులు కావడంతో అతనిని కడప స్పెషల్ బ్రాంచ్కు బదిలీ చేశారు. మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి హత్య జరగడం, ఆయన స్వయానా సీఎం జగన్మోహన్ రెడ్డికి చిన్నాన్న కావడంతో జిల్లా ఎస్పీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని కేసు దర్యాప్తు ప్రారంభించారు.
 
ఇందులో భాగంగా పులివెందుల డి.ఎస్.పి వాసుదేవన్ ఆధ్వర్యంలో కేసును ఛేదించడానికి నియమించిన స్పెషల్ టీం లో సి ఐ శ్రీరామ్  పని చేస్తున్నారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్యాప్తు ప్రారంభించడంతో దాదాపు 60 మంది ని అదుపులోకి తీసుకొని విచారించారు. 
 
వివేకానంద రెడ్డి సన్నిహితులే ఈ హత్య చేశారని ప్రాథమిక ఆధారాలు లభించడంతో శ్రీనివాస్ రెడ్డిని కూడా పలు మార్లు విచారించినట్లు తెలియవచ్చింది. కేసు కీలక దశకు చేరుకోవడంతో తనపై కూడా చార్జిషీట్ నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని భావించి శీను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు వర్గాల విశ్వసనీయ సమాచారం.
 
కేసును పక్కదోవ పట్టించడానికి ఆత్మహత్య చేసుకునేలా  శీను పై ఎవరైనా ఒత్తులు తెచ్చారా అనే విషయం పోలీసు దర్యాప్తులో తేలాల్సి ఉంది. కాగా నిజాయితీ అధికారి అయిన శ్రీరామ్ పేరు సూసైడ్ నోట్ లో రావడంతో జిల్లా ప్రజానీకం లో సర్వత్రా చర్చనీయాంశమైంది.
 
శ్రీరామ్ కు పోలీస్ శాఖ లో కూడా మంచి పేరుంది. అలాంటి శ్రీరామ్ పై  నిందలు రావడం తమకు బాధాకరంగా ఉందని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి హత్య కేసు లో నిందితుల ను వదిలే ప్రసక్తే లేదని పోలీస్ వర్గాలు పేర్కొంటున్నాయి.