1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 3 మే 2023 (07:40 IST)

ఐ డోంట్ కేర్.. మీరేమీ బాధపడొద్దు.. చంద్రబాబుకు రజనీకాంత్ ఓదార్పు

rajini - chandrababu
ఇటీవల విజయవాడలో జరిగిన స్వర్గీయ ఎన్.టి.రామారావు శతజయంతి వేడుకల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ పాల్గొని, అటు ఎన్టీఆర్‌పై, ఇటు చంద్రబాబుపై తనకు ఉన్న అభిమానం, గౌరవాన్ని మాటల రూపంలో వ్యక్తం చేశారు. ఈ మాటలను అధికార పార్టీ వైకాపా నేతలకు ఏమాత్రం మింగుడుపడలేదు. దీంతో మాజీ మంత్రి కొడాలి నాని, మంత్రి రోజాలతో రజనీకాంత్‌ను నోటికొచ్చినట్టు తిట్టించారు. పరుష పదజాలంతో దూషించారు. ఈ మాటలు టీడీపీ చీఫ్ చంద్రబాబును తీవ్రంగా బాధపెట్టాయి. దీంతో ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పైగా, రజనీకాంత్‌కు ఫోన్ చేసి తన ఆవేదనను వ్యక్తం చేశారు. 'మీరు నాలుగు మంచి మాటలు చెప్పినా వైకాపా నాయకులు తట్టుకోలేకపోతున్నారు. మీపై వారు మాటల దాడి చేయడం విచారకరం. నేను చాలా బాధపడుతున్నాను...' అని చంద్రబాబు పేర్కొన్నారు. 
 
దీనికి రజనీకాంత్ స్పందిస్తూ, 'తాను అవేమీ పట్టించుకోవడం లేదని, తేలిగ్గా తీసుకోవాలని చంద్రబాబుకు బదులిచ్చారు.  'ఉన్న విషయాలే చెప్పాను. ఎవరెన్ని విమర్శలు చేసినా లెక్కచేయను. నేను చెప్పిన దానికి కట్టుబడి ఉన్నాను. నా అభిప్రాయం మారదు...' అని రజనీకాంత్‌ పేర్కొన్నట్టు టీడీపీ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
 
కాగా, ఏప్రిల్‌ 28న విజయవాడలో జరిగిన ఎన్టీఆర్‌ శత జయంత్యుత్సవాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రజనీకాంత్‌... ఆయనతో తనకున్న అనుభవాల్ని, సినీ రంగంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి ఎన్టీఆర్‌ నుంచి ఎలా స్ఫూర్తి పొందిందీ వివరించారు. చంద్రబాబును దార్శనికుడిగా కొనియాడారు. హైదరాబాద్‌ ఈ రోజు ఇంతగా అభివృద్ధి చెందిందంటే దానికి అప్పట్లో చంద్రబాబు చేసిన కృషే ప్రధాన కారణమని ప్రశంసించారు. దాన్ని తట్టుకోలేని ఆర్‌.కె.రోజా వంటి మంత్రులు, కొడాలి నాని వంటి వైకాపా నాయకులు రజనీకాంత్‌పై తీవ్రమైన విమర్శలు చేశారు.