1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 ఏప్రియల్ 2023 (17:44 IST)

రజనీకాంత్‌పై లక్ష్మీపార్వతీ ఫైర్.. చంద్రబాబు మైకు వైరులు కట్ చేసి..?

lakshmi parvathi
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్‌పై వైసీపీ నేత, తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి మండిపడ్డారు. నాడు వెన్నుపోటు సమయంలో చంద్రబాబుకు మద్దతుగా నిలిచినవాళ్లలో రజనీకాంత్ కూడా వున్నారని లక్ష్మీపార్వతీ ఆరోపించారు. 
 
తర్వాత కాలంలో ఎన్టీఆర్‌ను కలిసిన రజనీకాంత్ తాను తప్పు చేశానని క్షమాపణ కోరారని ఆమె వివరించారు. చంద్రబాబు ఎంతో తెలివిగా మళ్లీ రజనీకాంత్‌ను వాడుకుంటున్నారని, రజనీకాంత్ ద్వారా బీజేపీకి దగ్గరవ్వాలన్నది చంద్రబాబు ఎత్తుగడ అని ఆరోపించారు. 
 
చంద్రబాబుతో కలిసిన రజనీకాంత్ కూడా వెన్నుపోటుదారుడేనని, అతడికి నిజాయతీ ఉంటే ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఏం మాట్లాడారో తెలుసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు నేపథ్యంలో తనపై మీడియాలో వస్తున్న కథనాలపై కూడా లక్ష్మీపార్వతీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 
 
తనపై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్న వారిపై కేసులు పెడతామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్టీఆర్ భార్య పదవికి మించి ఇంకే పదవి నాకు పెద్దది కాదు.. ఎన్టీఆర్ పెరాల్సిస్ అనారోగ్యం, పిల్లలకు ఆస్తుల పంపకాలు, అధికారం కోల్పోయిన పరిస్థితుల్లో నేను ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చానని వివరించారు. 
 
అల్లుళ్ల కొట్లాట వల్లే 1989 ఎన్నికల్లో ఓడిపోయామని అప్పట్లో ఎన్టీఆర్ తనకు చెప్పారన్నారు. ఎన్టీఆర్‌కు నాతో పెళ్లి అవటం చంద్రబాబుకు ముందు నుంచీ ఇష్టం లేదని మా వివాహ ప్రకటనను అడ్డుకోవటానికి చంద్రబాబు మైకు వైరులు కట్ చేసి లైట్‌లు ఆఫ్ చేసి నానా బీభత్సం చేశాడని మండిపడ్డారు.