శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 మే 2020 (09:27 IST)

తుఫానుగా మారిన ఎంఫాన్ - తప్పించుకున్న ఆంధ్ర - బెంగాల్ వైపు పయనం

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం రాత్రి తుఫానుగా మారింది. ఇది ఆదివారం రాత్రికి పెను తుఫానుగా మారి సోమవారం ఉదయానికి మరింతగా బలపడనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే, ఈ తుఫాను ఆంధ్రా తీరప్రాంతాన్ని తాకబోదని, వెస్ట్ బెంగాల్ వైపు పయనిస్తుందని తెలిపారు. 
 
ప్రస్తుతం ఎంఫాన్ ఒడిశాలోని పారాదీప్‌కు 1,040 కిలోమీటర్ల దూరంలోనూ, పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు 1,200 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. సోమవారం, పశ్చిమ బెంగాల్ వైపునకు దిశను మార్చుకుని 20వ తేదీ నాటికి ఇది పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరాన్ని దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
 
మరోవైపు, ఎంఫాన్ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై అంతగా చూపించకున్నా, తీర ప్రాంత ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని విశాఖ వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మత్స్య కారులు వేట నిమిత్తం సముద్రంలోకి వెళ్లరాదని, రేపటి నుంచి తీరం వెంబడి గాలుల తీవ్రత పెరుగుతుందని హెచ్చరించారు.
 
ఎంఫాన్‌కు ఉపరితల ద్రోణి కూడా తోడవడంతో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. కాగా, ఈ తుఫానుకు ఇంఫాన్ అని ఐఎండీ అధికారులు పేరు పెట్టిన విషయం తెల్సిందే.