1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 14 మే 2020 (09:12 IST)

ప్రత్యేక రైళ్ళలో లిమిటెడ్ వెయిటింగ్ లిస్ట్ జాబితా - 22 నుంచి అమలు

రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ వేళ దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి దేశంలోని 15 ప్రధాన నగరాలకు రెండు జతల రైళ్ళను నడుపుతోంది. వీటిలో కొన్ని డైలీ సర్వీసులు, మరికొన్ని వారంతపు, బై వీక్లీ ట్రైన్స్ కూడా ఉన్నాయి. అయితే, ఈ రైళ్లలో ప్రయాణం చేయాలంటే కేవలం ఆన్‌లైన్‌లో టిక్కెట్‌ను రిజర్వేషన్ చేసుకోవాల్సివుంది. అంటే కేవలం రిజర్వేషన్ ఉన్నవారికి మాత్రమే ఈ రైళ్ళలో ప్రయాణించే అవకాశం ఉంది. 
 
ప్రస్తుతం, కేంద్రం ఆదేశాల మేరకు.. ఈ నెల 1వ తేదీ నుంచి వలస కూలీలను తరలించేందుకు, ఆపై ప్రత్యేక రైళ్లను కలిపి, ఇప్పటివరకూ 366 రైళ్లను నడిపింది. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా దశల వారీగా రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తామని కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ వెల్లడించారు. 
 
ఈ నేపథ్యంలో రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లలో టికెట్ కన్ఫర్మ్ అయిన వారిని మాత్రమే అనుమతిస్తున్నామని, ఈ నెల 22వ తేదీ నుంచి తిరిగే రైళ్లలో మాత్రం వెయిటింగ్ లిస్ట్ టికెట్లు కూడా ఉంటాయని పేర్కొంది. 
 
22వ తేదీ నుంచి నడిచే అన్ని రైళ్ళలో ప్రయాణానికి ఈ నెల 15వ తేదీ నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాని తెలిపింది. ఇందులో వెయిటింగ్ లిస్ట్ టికెట్ల విక్రయాలు కూడా ఉంటాయని వెల్లడించింది.
 
ఈ వెయిట్ లిస్ట్‌ జాబితాలో స్లీపర్ క్లాసులో 200, చెయిర్ కార్, థర్డ్ ఏసీలో 100, సెకండ్ ఏసీలో 50, ఫస్ట్ ఏసీ, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లలో 20 టిక్కెట్లు చొప్పున వెయిటింగ్ లిస్ట్ టికెట్లను జారీ చేస్తామని తెలిపింది. 
 
కాగా, దేశంలో కరోనా వైరస్ దెబ్బకు ప్రజా రవాణాను పూర్తిగా బంద్ చేసిన విషయం తెల్సిందే. ఈ లాక్డౌన్‌కు ముందు ప్రతి రోజూ దేశ వ్యాప్తంగా 12 వేల రైళ్లను రైల్వే శాఖ నడుపుతూ వచ్చింది. లాక్డౌన్ ప్రకటన వెలువడిన తర్వాత అన్ని రైళ్లను నిలిపివేసింది.