తిరుమల గిరులు కిటకిట.. గోగర్భం డ్యామ్ వరకు భక్తుల బారులు
తిరుమల గురులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. క్యూ కాంప్లెక్స్లు నిండి బయట వరకు భక్తుల క్యూలైన్లు చేరాయి. ఫలితంగా శ్రీవారి దర్శనానికి ఏకంగా 30 గంటల వరకు సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 63 వేల మందిగా ఉండగా, శ్రీవారి హుండీ ఆదాయం ఏకంగా రూ.5.31 కోట్లుగా నమోదైంది.
సాధారణంగా వారాంతపు రోజుల్లో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. కానీ, ఈ వారం మాత్రం వారాంతానికి ముందే భక్తుల తాడికి ఒక్కసారిగా అనూహ్యంగా పెరిగిపోయింది. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 24 నుంచి 30 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అధికారులు వెల్లడించారు.
భక్తుల రద్దీ కారణంగా వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. దీంతో క్యూ లైన్ల బయట వరకు భక్తులు బారులు తీరారు. ప్రస్తుతం భక్తుల క్యూలైన్ గోగర్భం డ్యామ్ సర్కిల్ సమీపంలోని అక్టోపస్ భవనం వరకు భక్తులు శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లో గంటల భక్తులు నిరీక్షిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా యాత్రికులు ఈ విషయాన్ని గమనించి తమ ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకోవాలని తితిదే అధికారులు సూచిస్తున్నారు.
కాగా, జూలై 16వ తేదీ గురువారం ఒక్కరోజే 63,556 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 35900 మంది తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.31 కోట్లుగా నమోదైంది. తితిదే అధికారులు 4.12 లక్షల లడ్డూలను విక్రయించగా 2.55 లక్షల మందికి అన్నప్రసాదాన్ని అందించారు. అలాగే, 4,051 మంది భక్తులకు వైద్య సేవలు అందించినట్టుగా తితిదే తెలిపింది.
