మంగళవారం, 25 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 6 సెప్టెంబరు 2021 (23:02 IST)

కేంద్రం నుండి రావాలసిన మొత్తాలపై స్పష్టమైన కార్యాచరణ: డాక్టర్ రజత్ భార్గవ

కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వ ఆదాయంలో కొరత నెలకొందని, దానిని పెంచే క్రమంలో కేంద్రం నుండి రాష్ట్ర వాటాగా రావలసిన మెత్తాల విషయంలో దృష్టి సారించటంతో పాటు, పన్ను ఎగవేతదారులను గుర్తించేందుకు అవసమైన అన్ని మార్గాలను అన్వేషించాలని రెవెన్యూ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ స్పష్టం చేసారు.
 
సెప్టెంబర్ 17న లక్నోలో జరగబోయే 45 వ జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తాల్సిన సమస్యలపై రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ ప్రధాన కమిషనర్ రవిశంకర్ నారాయణ్, ఆ శాఖ సీనియర్ అధికారులతో సోమవారం సచివాలయంలో రజత్ భార్గవ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.
 
సమీక్షలో ఆదాయ పెంపుకు సంబంధించి పాదరక్షలు, ఎరువుల అవుట్‌పుట్‌పై పన్ను ఇన్‌పుట్‌ పన్నురేట్ల కంటే తక్కువగా ఉంటుందని ఇది అదాయాన్ని కోల్పోయే సమస్యగా ఉండటమే కాక, ప్రాసెసింగ్ రీఫండ్‌ రూపంలో పరిపాలనా భారం నెలకొంటుందని దీనిని అధికమించాలని సూచించారు.
 
పన్ను ఎగవేత పద్ధతులను గుర్తించడం కీలకమని, ఇందుకోసం ప్రత్యేక డేటా అధారిత ఉపకరణాలను వినియోగించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశించారని గుర్తు చేసారు. పన్ను ఎగవేత దారులను పన్ను పరిధిలోకి తీసుకువస్తూ పన్నుల అదాయ పెంపు కోసం చేపట్టే ప్రత్యేక రోడ్డు సర్వే నిమిత్తం రిజిస్ట్రేషన్, స్టాంపులు, రవాణా తదితర ప్రభుత్వ శాఖల నుండి సమాచారాన్ని తీసుకోవాలని, సర్వే చేస్తున్నప్పుడు వ్యాపారవేత్తలు ఏ విధంగానూ అసౌకర్యానికి గురికాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.
 
 ప్రతికూల వృద్ధిని చూపుతున్న టెలికమ్యూనికేషన్స్, ఆటోమొబైల్స్, పామ్ ఆయిల్, రెస్టారెంట్లు తదితర రంగాలపై దృష్టి పెట్టాలని, ఈ క్రమంలో ఆన్‌లైన్ బిజినెస్ ప్లాట్‌ఫారమ్‌లు, వాహనాల రిజిస్ట్రేషన్‌లు, పోర్టుల నుండి దిగుమతి డేటా తదితర వనరులతో ఈ సంస్ధల టర్నోవర్‌ను క్రాస్ చెక్ చేయాలన్నారు. పన్ను బకాయిలు వసూలు చేయడానికి జిల్లా కలెక్టర్ల సహకారం తీసుకోవచ్చని, బడ్జెట్ అంచనాలలో పేర్కొన్న లక్ష్యాలను సాధించాలని అధికారులకు సూచించారు. వాణిజ్య పన్నుల శాఖ లక్ష్యాలను సాధించడంలో లోటు ఏర్పడితే అది రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం పై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.