శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By మోహన్
Last Updated : మంగళవారం, 21 మే 2019 (14:30 IST)

ఏపీ ఎగ్జిట్ పోల్స్‌పై కేఏ పాల్ రియాక్షన్ ఏమిటో తెలుసా?

ఏపీ ఎగ్జిట్ పోల్స్‌పై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తనను షాక్‌కు గురి చేశాయన్నారు. ఆ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలన్నీ ట్యాంపరింగ్‌కు గురి అయ్యాయని ఆరోపించారు. అంతేకాదు ప్రజాశాంతి పార్టీ గుర్తుకు ఓటేస్తే అది కాస్త వైసీపీ గుర్తు ఫ్యాన్‌కు పడిందని వాపోయారు. 
 
ఎగ్జిట్ పోల్స్‌పై స్పందిస్తూ ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియోని పోస్ట్ చేసారు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. అమెరికా ఇంటెలిజెన్స్, రష్యన్ హ్యాకర్ల పాత్ర ఈ ఎన్నికల్లో ఉన్నట్లు స్పష్టమయిందని కేఏ పాల్ పేర్కొన్నారు. 
 
నర్సాపురం లోక్‌సభ స్థానంలో తనకు చాలా ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. అక్కడ హెలికాప్టర్ గుర్తుకు ఓటు వేస్తే ఫ్యాను గుర్తుకు పడిందని ప్రజలు ఫిర్యాదు చేశారని కేఏ పాల్ చెప్పుకొచ్చారు. అంతేకాదు 70 నుంచి 80 శాతం ఓట్లు తమ ప్రజా శాంతి పార్టీకే పడ్డాయని మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసారు.
 
ఏపీలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఈసీని కోరుతా అన్నారు. అయితే ఇప్పుడు ఈసీలో పని చేస్తున్న ఓ కమీషనర్ అశోక్ లావాసాకు మరియు సీఈసీ అరోరాతో అభిప్రాయభేధాలు ఉన్నాయని పాల్ ఆరోపించారు. అందువల్లే అది సాధ్యం కావడం లేదని పాల్ చెప్పారు. దీంతో ఏపీలో ఎన్నికలను రీకాల్ చేయ్యాలని సుప్రీం కోర్టుకు వెళతానన్నారు. 
 
అంతేకాదు ఏపీలో ప్రజాశాంతి పార్టీకి 30 సీట్లు రావడం పక్కా అని చెప్పారు. టీడీపీకి 90-100 సీట్లు వచ్చినా, లేక వైసీపీకి 90-100 సీట్లు వచ్చినా మన 30 స్థానాలు మనకే ఉంటాయని ఆయన అన్నారు.