1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Lagadapati Rajagopal comments on Exit Poll Survey Results

సర్వే అంచనా తప్పితే మళ్ళీ సర్వే చేయను : లగడపాటి రాజగోపాల్

Lagadapati Rajagopal
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలపై తాను వెల్లడించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు తప్పు అయితే ఇకపై సర్వేలు చేయబోనని ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరుగాంచిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రకటించారు. 
 
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ముందస్తు ఎన్నికల్లో మాజీ ఎంపీ, ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ సర్వే అట్టర్ ప్లాప్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సర్వే ప్లాప్ అవ్వడంతో రాజగోపాల్‌పై ఉన్న విశ్వసనీయత చాలా తగ్గిందని విశ్లేషకులు, క్రిటిక్స్ అప్పట్లో పెద్ద హడావుడే చేశారు. 
 
అయితే తాజాగా ఏపీ ఎన్నికలపై ఆక్టోపస్ సర్వే ఫలితాలు వెల్లడించారు. ఏపీలో సైకిల్‌కు తిరుగులేదని.. ఖచ్చితంగా టీడీపీ గెలిచి తీరుతుందని లగడపాటి తేల్చేశారు. సర్వే ఫలితాలు వెల్లడించిన అనంతరం ఆయన మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పుకొచ్చారు.
 
ఈ దఫా తన సర్వే తప్పితే ఖచ్చితంగా మళ్లీ సర్వే చేయబోనని చెప్పారు. ఈ నెల 23వ తేదీ తర్వాత నా విశ్వసనీయత పెరుగుతుంది. నా సర్వేను నమ్మాలని నేను ఎవరినీ కోరడంలేదన్నారు. బల్లగుద్ది అస్సలే చెప్పట్లేదని, కత్తిపెట్టి ఇది వినండని నేనేం అనలేదన్నారు. వినేవాళ్లు వింటారు. నమ్మేవాళ్లు నమ్ముతారు. నా వాయిస్‌ వెళ్లింది. నాకు అటు ఏపీ.. ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయ పార్టీతో సంబంధంలేదని చెప్పారు. 
 
పైగా, తన రాజకీయ ప్రయాణం కాంగ్రెస్‌తోనే మొదలైందన్న విషయం మీ అందరికీ తెలుసు. అదే కాంగ్రెస్ పార్టీనే నా రాజకీయ జీవితం అంతమైంది. నాకు ఏ పార్టీ ఎక్కువ కాదు.. ఏ పార్టీ తక్కువ కాదు.. అన్ని పార్టీలూ నాకు సమానమే. దయచేసి నన్ను ఏ పార్టీతోనూ ముడిపెట్టొద్దు. స్వతంత్రంగానే నేను ఉండదలుచుకున్నట్టు లగడపాటి రాజగోపాల్ వెల్లడించారు.
 
ఈ సారి తన సర్వే కచ్చితంగా సక్సెస్ అవుతుందని లగడపాటి మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే లగడపాటితో మరో రెండు మూడు సర్వే సంస్థలు సైతం టీడీపీ అధికారమని తేల్చి చెప్పేశాయి. అయితే ఏపీలో ఈ సారి లగడపాటి సర్వే పాస్ అవుతుందా..? లేకుంటే ఇక్కడ కూడా అట్టర్ ప్లాప్ అవుతుందా..? అనేది తెలియాలంటే మే-23 వరకు వేచి చూడాల్సిందే మరి.
తర్వాతి కథనం
అనుమానం హత్యకు కారణమైంది.. భార్యను చేతబడి చేసి చంపేశాడని?