బంగాళాఖాతంలో అల్పపీడనం - ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏర్పడివుంది. దీంతో ఉత్తరాంధ్రకు శుక్ర, శనివారాల్లో తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, వాతావరణ శాఖ వెల్లడించాయి. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
గురువారం తెల్లవారుజామున ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా 9.4 కిలోమీటర్ల ఎత్తు వరకు సైక్లోనిక్ సర్క్యులేషన్ విస్తరించి ఉన్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఈ వ్యవస్థ క్రమంగా బలపడుతూ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదులుతున్నట్లు పేర్కొంది.
దీని ప్రభావంతో శుక్ర, శనివారాల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, కొన్నిసార్లు గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవచ్చని హెచ్చరించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అలలు ఎగసిపడతాయని తెలిపారు. ఈ నేపథ్యంలో రానున్న 48 గంటల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ఏపీఎసీఎంఏ స్పష్టం చేసింది. ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు వెంటనే తీరానికి తిరిగి రావాలని సూచించింది.
