శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 10 ఆగస్టు 2019 (08:13 IST)

కాంగ్రెస్ రథసారథిగా ముకుల్ వాస్నిక్?

134ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించేందుకు రథసారథి ఎవరా అన్న ఉత్కంఠకు తెరపడింది. వందేళ్లకు పైగా ఘనచరిత్ర కలిగిన కాంగ్రెస్ కు ఇకపై దశ దిశ చూపించే అధినేత ఎంపిక దాదాపు ఖరరైనట్లు తెలుస్తోంది. 
 
గాంధీ కుటుంబానికి వీరవిధేయుడు, సోనియాగాంధీకి అత్యంత సన్నిహితుడు, రాజకీయ కార్యదర్శి ముకుల్ వాస్నిక్ కు అధినేత బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడిగా ముకుల్ వాస్నిక్ పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. అధికారికంగా శనివారం సీడబ్ల్యూసీ ప్రకటించనుందని తెలుస్తోంది.   
 
ఇకపోతే కాంగ్రెస్ పార్టీ నూతన రథసారథి ఎంపిక ఆ పార్టీకి పెద్ద సమస్యగా మారింది. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు ఈసారి గాంధీ కుటుంబం కాకుండా వేరేవారికి అవకాశం ఇవ్వాలని రాహుల్ గాంధీ పట్టుబట్టారు. 
 
ఈ పరిణామాల నేపథ్యంలో అధ్యక్షుడి ఎంపిక కాంగ్రెస్ పార్టీకి కత్తిమీద సాములా మారింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు అయిన ఏకే ఆంటోనీ, అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్, యువనేత జ్యోతిరాధిత్య సింధియా పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. 
 
 అయితే అధ్యక్ష బాధ్యతలు తీసుకునేందుకు పార్టీ సీనియర్ నేతలు మెుగ్గు చూపలేదు. రోజురోజుకు పార్టీ అధ్యక్షుడి ఎంపిక ఆలస్యమవుతున్న నేపథ్యంలో సీడబ్ల్యూసీ నూతన అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు వేగం చేసింది.