గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 ఆగస్టు 2021 (09:16 IST)

నిండు కుండలా నాగార్జున సాగర్ - 22 గేట్లు ఎత్తివేత

నాగార్జున సాగర్ జలాశయం నిండు కుండను తలపిస్తోంది. దీంతో ప్రాజెక్టుకు చెందిన 22 క్రస్ట్ గేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా… ఇప్పటికే 585 అడగులకు నీటిమట్టం చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా… ఇప్పటికే 300 టీఎంసీల నీటితో ప్రాజెక్టు నిండు కుండలా కనిపిస్తోంది. 
 
ఈ నేపథ్యంలో అధికారులు సాగర్ 22 గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. గేట్లు తెరుచుకోవడంతో సాగర్‍లో పర్యాటకుల సందడి నెలకొన్నది. పెద్ద సంఖ్యలో పర్యాటక ప్రేమికులు ప్రాజెక్టు వద్దకు చేరుకొని కృష్ణమ్మ సోయగలను ఆస్వాదిస్తున్నారు. పర్యటకులతో సాగర్ ప్రాంత పరిసరాలు కోలాహలంగా మారాయి.
 
మరోవైపు కృష్ణా దిగువ ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు ఇప్పటికే అలర్ట్ చేశారు. నదిలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. గతేడాది పోలిస్తే ఈ ఏడాది 20 రోజులు ముందుగానే ప్రాజెక్టులో పూర్తి స్థాయికి నీటి మట్టం చేరుకోవడం గమనార్హం. 
 
ఎగువన కర్ణాటకలోని కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి, జూరాల, నారాయణపూర్ ప్రాజెక్టులు నిండటంతో ఆ నీటిని కిందకు వదులుతున్నారు. దీంతో సాగర్‌కు భారీగా వరద వచ్చి చేరుతోంది. ప్రస్తుతం సాగర్ ఇన్‌ఫ్లో 5.14లక్షల క్యూసెక్కులుగా ఉంది.