నాకు పవన్ కల్యాణ్ బిగ్ బ్రదర్.. కష్టకాలంలో అండగా నిలిచారు.. నారా లోకేష్
2047 నాటికి ఆంధ్రప్రదేశ్ 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక మాట ఇస్తే అది జరిగి తీరుతుందని, ఆయన నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించడమే తన ముందున్న కర్తవ్యమని లోకేశ్ అన్నారు.
తమపై ఎలాంటి ఒత్తిడి లేదని, సవాళ్లను ఇష్టంగా స్వీకరిస్తామని తెలిపారు. కష్టకాలంలో అండగా నిలిచిన పవన్ కళ్యాణ్ తనకు బిగ్ బ్రదర్ అని, జీవితాంతం తనకు పెద్దన్నేనని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తాము కేవలం ఒక నగరాన్ని మాత్రమే నిర్మించడం లేదని.. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అనే నినాదాన్ని బలంగా నమ్ముతాం.
విశాఖపట్నం, అమరావతి, తిరుపతిలను ఆర్థిక రీజియన్లుగా అభివృద్ధి చేస్తూ, వాటి పరిధిలో పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నామని నారా లోకేష్ వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు మూడు ప్రధాన కారణాలు ఉన్నాయని లోకేష్ పేర్కొన్నారు.
ఫార్చూన్ 500 కంపెనీలను ఆకర్షించేందుకు ఎకరా భూమిని 99 పైసలకే ఇస్తున్నామని, తాము ఇచ్చే భూమి విలువ కన్నా ఆ కంపెనీల రాకతో ఏర్పడే ఆర్థిక కార్యకలాపాలు, ఉద్యోగ కల్పన ఎన్నో రెట్లు అధికమని లోకేశ్ తెలిపారు. అమరావతి నిర్మాణం శరవేగంగా సాగుతోందని, ఇది భవిష్యత్తుకు చిరునామా అని లోకేశ్ అన్నారు.