1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 6 నవంబరు 2020 (08:51 IST)

ఆదరణ మరింత పెంచేలా కార్యక్రమాలు: ఎస్వీబీసీ చైర్మన్ కు టీటీడీ చైర్మన్ సూచన

ఎస్వీబీసీ నూతన చైర్మన్ సాయి కృష్ణ యాచేంద్ర టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. యాచేంద్ర ను ఎస్వీబీసీ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. హిందూ ధార్మిక ప్రచారంలో ఛానల్ ను మరింత ముందుకు తీసుకువెళ్లాలని సుబ్బారెడ్డి సాయికృష్ణకు సూచించారు.

ఎస్వీబీసీ కార్యక్రమాలకు వీక్షకుల నుంచి వస్తున్న ఆదరణ మరింత పెంచేలా కార్యక్రమాలు రూపొందించాలన్నారు. చానల్ ను ఇతర భక్తి చానళ్లకు ధీటుగా తయారుచేయాలని, ఇందుకు తమ పూర్తి సహకారం అందిస్తామని సుబ్బారెడ్డి చెప్పారు.                  
 
11 నుండి శ్రీనివాసమంగాపురం పవిత్రోత్సవాలు
టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో నవంబరు 11 నుండి 13వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. కోవిడ్‌-19 మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు ఆల‌యంలో ఏకాంతంగా ఈ ఉత్స‌వాలు నిర్వ‌హిస్తారు.
 
ఇందుకోసం నవంబరు 10న రాత్రి 7 గంటలకు మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం నిర్వ‌హిస్తారు. సంవ‌త్స‌రం పొడ‌వునా ఆల‌యంలో జ‌రిగిన దోషాల నివార‌ణకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో వేదపఠనం, ఆలయశుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
 
ఇందులో భాగంగా మొదటిరోజైన నవంబరు 11న పవిత్రప్రతిష్ఠ‌, రెండో రోజు నవంబరు 12న పవిత్ర సమర్పణ, చివరిరోజు నవంబరు 13న పూర్ణాహుతి నిర్వ‌హిస్తారు. ఈ మూడు రోజుల పాటు ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం చేప‌డ‌తారు. పవిత్రోత్సవాల కారణంగా నవంబరు 11 నుండి 13వ తేదీ వరకు ఆర్జిత కల్యాణోత్సవం సేవను టిటిడి రద్దు చేసింది.