శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (08:32 IST)

నేడు ఏపీవ్యాప్తంగా రాస్తారోకోలు

విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ 20 రోజులుగా పోరాటం చేస్తున్న క్రమంలో, ప్రధాని మోడీ బుధవారం తన ప్రసంగంలో ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకో నిర్వహించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక రాష్ట్ర నాయకులు జి.ఓబులేశు, వి.ఉమామహేశ్వరరావుల పిలుపునిచ్చారు.

ఈ మేరకు విజయవాడ ఎంబి విజ్ఞాన కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదంతో రాష్ట్ర ప్రజలు పోరాడుతున్న క్రమంలో బిజెపి నియంతృత్వ ప్రభుత్వం విశాఖ ఉక్కునే కాదు, దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తామని ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఖండించారు.

ఈ సందర్భంగా ఓబులేశు మాట్లాడుతూ విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించకుండా అన్యాయం చేసి, నేడు నష్టాల సాకు చూపి ప్రైవేటీకరించాలని చెప్పడం దారుణమని తెలిపారు.

ప్రధాని మోడీ ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ కార్పొరేట్లకు దోచిపెట్టే పనిలోనే నిమగమై ఉన్నారని, రూ.లక్షల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టిన పెట్టుబడిదారులకు అండగా నిలబడి బ్యాంకులను ఇతర బ్యాంకుల్లో విలీనం చేశారని అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా జరిగే రాస్తారోకోలో అన్ని ట్రేడ్‌యూనియన్లు, ప్రజాసంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలు భాగస్వామ్యమవుతున్నాయని పేర్కొన్నారు.