1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 27 ఫిబ్రవరి 2021 (09:17 IST)

ఏపీలో రేషన్ కష్టాలు

తీరిక ఉన్నప్పుడు స్టోర్‌ డీలర్‌ వద్దకు వెళ్లి ప్రశాంతంగా సబ్సిడీ బియ్యం తెచ్చుకునేవారు. ఏపీలో ప్రస్తుతం వీధుల్లో పనులు వదులుకుని గంటల తరబడి వాహనం కోసం వేచివుండాల్సిన దుస్థితి ఏర్పడింది. బియ్యం పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్థంగా తయారైంది.

ఇంటింటికీ బియ్యం పంపిణీ జరుగుతోందన్నది మాటలకే తప్ప వీధివీధికి ఒక చోట ఇస్తున్నారు. అందులో సర్వర్‌ కూడా సక్రమంగా పనిచేయకపోవడంతో జనం అల్లాడిపోతున్నారు. పంపిణీ వాహనం వచ్చే సమయాన్ని చెప్పేవారు లేరని, దీంతో వాహనం కోసం ఎదురుచూడాల్సిన వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు.

ఇంటింటికీ వచ్చి కొలతలు వేసి రేషన్‌ బియ్యం ఇస్తారని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చెప్పారు. అయితే ఆయన చెప్పిందొకటి... ఇక్కడ జరుగుతోంది మరొకటి. వీధుల్లో ఏదో ఒక మూలన వాహనాన్ని నిలబెట్టి రేషన్‌ పంపిణీ చేస్తున్నారు.

అక్కడ పంపిణీ చేస్తున్నట్లు కనీసం సమాచారం కూడా ఇవ్వడంలేదు. దీంతో లబ్ధిదారులు పనులను మానేసుకుని రేషన్‌ వాహనం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. కూలీ నాలీ చేస్తే తప్ప పూటగడవని పేదల రేషన్‌ కోసం కూలీ పనులను మానేసుకుని ఇంటివద్దనే పడిగాపులు కాస్తున్నారు.

వాహనం వచ్చినప్పుడు లేకపోయామా.. ఇక అంతే సంగతులు... మరో నెలపాటు రేషన్‌ సరుకుల కోసం ఎదరుచూడాల్సిందేనంటూ లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతినెలా తమకు తీరికి ఉన్న సమయంలో డీలర్ల వద్ద వెళ్లి సరుకులు తెచ్చుకునేవారమని, ఈ కొత్త పద్ధతితో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోందని వాపోతున్నారు.