కర్నూలు జిల్లాలో రిలయన్స్ ప్లాంట్.. ఏం తయారు చేస్తారు?
ఏపీలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లులో రిలయన్స్ పరిశ్రమ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం సమ్మతం తెలిపింది. ఈ పరిశ్రమలో కూల్డ్రింక్స్, జ్యూస్లను తయారు చేస్తారు. ఈ పరిశ్రమ ద్వారా దాదాపుగా 1200 మంది స్థానికులకు ఉపాధి అవకాశాలు లభ్యంకానున్నాయి. ఈ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం 80 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఇందుకోసం రిలయన్స్ సంస్థ రూ.1622 కోట్లు ఖర్చు చేయనుంది.
ఈ పరిశ్రమను కర్నూలు సమీపంలోని ఓర్వకల్లు వద్ద ఉన్న ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థకు చెందిన ల్యాండ్ బ్యాంకులో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఎకరా రూ.30 లక్షల చొప్పున మొత్తం 80 ఎకరాల భూమిని రియలన్స్ సంస్థకు ప్రభుత్వం కేటాయించింది. అంతేకాకుండా, రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 ప్రకారం అవసరమైన ప్రోత్సాహకాలను కూడా అందజేయనన్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ పరిశ్రమ ఏర్పాటు వల్ల స్థానికంగా సుమారు 1200 మందికి ప్రత్యక్షంగా మరో 500 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి. రాబోయే యేడాది డిసెంబరు నెలకల్లా ఈ ప్లాంట్లో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించాలని రిలయన్స్ సంస్థను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు తుదపరి చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీఐఐసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్కు పరిశ్రమలు, వాణిజ్య విభాగం కార్యదర్శి చిరంజీవి చౌదరి ఆదేశాలు జారీచేశారు. ఈ పరిణామం రాయలసీమ ప్రాంత పారిశ్రామిక ప్రగతికి దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయడుతున్నారు.