వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం కారణంగా రానున్న నాలుగు రోజుల పాటు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకునివున్న ఒరిస్సా - వెస్ట్ బెంగాల్ తీర ప్రాంతాల్లో గురువారం జూన్ 26వ తేదీన అల్పపీడనం ఏర్పడినట్టు ఏపీఎస్డీఎంఏ తెలియజేసింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్టణం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావణ శాఖ అధికారులు తెలిపారు.
ఈ అల్పపీడన ప్రభావం సుమారు నాలుగు రోజుల పాటు ఉంటుందని, ఈ సమయంలో చెదురుముదురుగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు కూడా కురవవచ్చని ఏపీఎస్డీఎంఏ హెచ్చరించింది. అంతేకాకుండా 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని, రైతులు, వ్యవసాయ పనులు విషయంలో అప్రమత్తత వహించాలని అధికారులు కోరారు.