వైజాగ్లో కాగ్నిజెంట్ కార్యాలయం... థ్యాంక్స్ చెప్పిన మంత్రి నారా లోకేశ్
సముద్రతీర ప్రాంతమైన విశాఖపట్టణంలో ప్రముఖ టెక్ కంపెనీ కాగ్నిజెంట్ తన ఆఫీస్ను స్థాపించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని ఆ సంస్థ అధికారికంగా వెల్లడించింది. దీనిపై ఏపీ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. కాగ్నిజెంట్ తమ భవిష్యత్తు కార్యకలాపాలకు విశాఖపట్నం నగరాన్ని ప్రధాన కేంద్రంగా ఎంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.
ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా వేదికగా కాగ్నిజెంట్ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న సంస్థలకు తమ ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందన్నారు. తమ కార్యకలాపాల విస్తరణలో భాగంగా విశాఖపట్టణాన్ని కీలక కేంద్రంగా ఎంచుకున్న కాగ్నిజెంట్ నిర్ణయంపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు.
'తమ భవిష్యత్ కార్యకలాపాలకు విశాఖను ప్రధాన కేంద్రంగా ఎంచుకున్న కాగ్నిజెంట్కు ధన్యవాదాలు. సన్రైజ్ రాష్ట్రానికి స్వాగతం' అంటూ ఆయన తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. రాష్ట్ర యువతలో నూతన ఆశలు రేకెత్తిస్తూ, వారిలో ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపజేసేలా కాపులుప్పాడలో కాగ్నిజెంట్ అత్యాధునిక క్యాంపస్ను ఏర్పాటు చేయనుండటం శుభపరిణామమని మంత్రి లోకేశ్ అన్నారు.
సీఎం చంద్రబాబు దార్శనిక నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ స్థాయి ఆవిష్కరణలకు కేంద్రంగా, యువతకు ఉపాధి కల్పించే శక్తి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని లోకేశ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన అవకాశాలు కల్పించడం ద్వారా వారి భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహిస్తూ, మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తామన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సానుకూల ఫలితాలు సాధిస్తామన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కాగ్నిజెంట్ రాకతో విశాఖ ఐటీ రంగంలో మరింత అభివృద్ధి చెందుతుందని, స్థానిక యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.