సింగయ్య మృతి కేసు - జగన్ అరెస్టు తప్పదా? హైకోర్టులో క్వాష్ పిటిషన్
పల్నాడు జిల్లాలో చిలీ సింగయ్య అనే వృద్ధుడి మృతి కేసులో వైకాపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరెస్టయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల జగన్ పల్నాడు జిల్లా రెంట్లపాడులో పర్యటించారు. ఆ సమంయలో ఆయన ప్రయాణిస్తున్న కారు ముందు చక్రం కింద పడి సింగయ్య మృత్యువాతపడ్డాడు. ఈ మృతికి సంబంధించి జగన్ కారు డ్రైవర్ను మొదటి నిందితుడుగాను, రెండో నిందితుగా జగన్మోహన్ రెడ్డి పేరు, పీఏ నాగేశ్వర్ రెడ్డి, వైకాపా నేతలు వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజనీలను నిందితులుగా చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే జగన్ ప్రయాణించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో జగన్తో పాటు మిగిలిన వారంతా హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ చేపడుతామని హైకోర్టు తెలిపింది. జగన్ వాహనం కింద సింగయ్య పడినట్టు వీడియోలో ఉందని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించిన విషయం తెల్సిందే. సీసీటీవీ ఫుటేజీ, డ్రోన్ దృశ్యాలు, ఘటనా స్థలంలో ఉన్నవారు తీసిన వీడియోలు పరిశీలించినట్టు ఆయన తెలిపారు. ఆ తర్వాత కేసు నమోదు చేశామని తెలిపారు.