శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 మార్చి 2022 (08:36 IST)

40 వసంతాల తెలుగుదేశం పార్టీ - నేడు ఆవిర్భావ దినోత్సవం

తెలుగుదేశం పార్టీకి నేటితో 40 యేళ్లుపూర్తికానున్నాయి. దీంతో ఆ పార్టీ శ్రేణులు మంగళవారం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. 1982 మార్చి 29వ తేదీన హైదరాబాద్ నగరంలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నాటి వెండితెర వేలుపు, ఆంధ్రుల ఆరాధ్యదైవం, మహానటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు టీడీపీని స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ పార్టీ తెలుగు ప్రజల కోసం, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం పాటుపడుతుంది. 
 
ఈ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీ శ్రేణులు వివిధ రకాలైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా, హైదరాబాద్, విజయవాడ నగరాల్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో ఆ పార్టీ నేతలు పాల్గొననున్నారు. హైదరాబాద్‌లో జరిగే పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, అమరావతిలో జరిగే వేడుకల్లో నారా లోకేష్‌లు పాల్గొంటున్నారు. 
 
సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ ఆదర్శ్ నగర్‌లో పార్టీ ప్రకటించిన న్యూ ఎమ్మెల్యే క్వార్టర్సును చంద్రబాబు, తెలుగుదేశం నేతలు సందర్శించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఎన్టీఆర్ ఘాట్‌లో ఎన్టీఆర్ సమాధికి చంద్రబాబునాయుడు నివాళులర్పిస్తారు. సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌లో జరిగే పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. 
 
అలాగే, అమరావతి పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ 40 వసంతాల వేడుకల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు ఉండవల్లిలోని నివాసం నుండి టీడీపీ కేంద్ర కార్యాలయం వరకూ జరిగే బైక్ ర్యాలీలో ఆయన పాల్గొంటారు. 
 
శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ కడప నుంచి కర్నూలు వరకూ వాడవాడలా టీడీపీ నేతలు పార్టీ జెండా ఆవిష్కరణ వేడుకల్లో పాల్గొంటారు. బైక్ ర్యాలీలతో హోరెత్తించనున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం పార్టీ శ్రేణులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.