శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 సెప్టెంబరు 2022 (18:13 IST)

ఎన్డీయే కూటమిలోకి టీడీపీ.. ప్రచారం చేసేవారే ఆన్సర్ చెప్పాలి : చంద్రబాబు

chandrababu
భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం పార్టీ చేరబోతున్నట్టు సాగుతున్న ప్రచారంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్పందించారు. ఈ తరహా ప్రచారం చేసేవారే సమాధానం చెప్పాలని కోరారు. ఈ అంశంపై తాను స్పందించబోనని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆ నాడు ఎన్డీయే కూటమి నుంచి వైదొలగాల్సి వచ్చిందని ఆయన వివరించారు. 
 
కాగా, 2023లో తెలంగాణాలో 2024లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ముఖ్యంగా 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణాలో అధికారంలోకి రావాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. ఇందుకోస తనతో కలిసి వచ్చే పార్టీలతో పొత్తుపెట్టుకోవాలని భావిస్తుంది. ఇందులోభాగంగా, తెలంగాణాలో దాదాపు 10 నుంచి 20 శాతం మేరకు ఓటు బ్యాంకు కలిగిన టీడీపీతో పొత్తుకు బీజేపీ సై అంటోంది. 
 
పనిలోపనిగా 2024 సార్వత్రి ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గణనీయమై సీట్లను సంపాదించుకునేందుకు వీలుగా టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబును మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు. 
 
ఎన్డీయేలో టీడీపీ చేరబోతోందని చెపుతున్న వారినే ఈ ప్రశ్న అడగాలని ఆయన అన్నారు. ప్రచారం చేస్తున్న వారే దీనికి సమాధానం చెప్పాలని అన్నారు. తానైతే ప్రస్తుతం దీనిపై స్పందించనని చెప్పారు.
 
రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన దానికంటే... జగన్ పాలన వల్ల రాష్ట్రం ఎక్కువ నష్టపోతోందని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆనాడు ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోణంలోనే తాము కేంద్ర రాజకీయాలను చూస్తామని అన్నారు. 
 
అధికారంలో ఉన్నప్పుడు పాలనపైనే ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల రెండు సార్లు నష్టపోయామని చెప్పారు. రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని వ్యక్తిగతంగా ఎంతో నష్టపోయామని తెలిపారు. దేశంలో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది టీడీపీనే అని చెప్పారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలను రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు.