1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. ttd will take the responsibility of developing appalayagunta venkateswara temple

అప్పలాయగుంట ఆలయ అభివృద్ధికి టిటిడి చర్యలు

ttd
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి చెప్పారు. శనివారం ఆయన శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ,  అప్పలాయగుంట ఆలయం వద్ద ఏర్పాటు చేసిన కల్యాణ కట్ట లో భక్తులు అధిక సంఖ్యలో తలనీలాలు సమర్పిస్తున్నారని చెప్పారు. ఆదివారం నుంచి ఈ కల్యాణ కట్టలో  సిబ్బందిని రెట్టింపు చేయడానికి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఆలయంలో తగినంతమంది అర్చకులను కూడా నియమిస్తామన్నారు.  శనివారం రోజు ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నందువల్ల స్వామివారి దర్శనం కోసం ఎండలో నిలబడాల్సి వస్తోందని భక్తులు చైర్మన్ దృష్టికి తెచ్చారు. 
 
దీనిపై స్పందించిన సుబ్బారెడ్డి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు నీడ కల్పించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ నెల 11వ తేదీ ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్మోహన్ రెడ్డి  తిరుమల శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. తిరుపతిలో చిన్న పిల్లల గుండె జబ్బు చికిత్స  ఆసుపత్రిని ప్రారంభిస్తారన్నారు. అలిపిరి నుంచి తిరుమలకు దాత నిర్మించిన పైకప్పును,  అలిపిరి వద్ద మరో దాత నిర్మించిన  గోమందిరాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. అలాగే 12వ తేదీ తిరుమలలో  దాత నిర్మించిన నూతన బూందీపోటును, 
 శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ కన్నడ ,హింది ఛానళ్లను ప్రారంభిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవ రాజ్ బొమ్మై పాల్గొంటారని తెలిపారు. అంతకు ముందు సుబ్బారెడ్డి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.
About Writer
జెఎస్కే
తర్వాతి కథనం
ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం జగన్ లేఖ