మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 15 ఫిబ్రవరి 2019 (09:52 IST)

తెలుగుదేశం పార్టీకి మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామా?

ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో రాష్ట్రంలో జంపింగ్ రాజకీయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. గత రెండు రోజల వ్యవధిలోనే అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ టీడీపీకి రాజీనామా చేసి వైకాపాలో చేరారు. అలాగే, ఇపుడు మరో సీనియర్ నేత మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా టీడీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
మొన్నటికిమొన్న చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీకి రాజీనామా చేసి వైకాపాలో చేరారు. అలాగే, నిన్నటికి నిన్న అనకాపల్లి ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా తన ఎంపీ పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి జగన్ మోహన్ రెడ్డి పార్టీలో చేరారు. 
 
ఇదేబాటలో మరికొంతమంది టీడీపీ నేతలు పయనించనున్నారనే వార్త ఇపుడు హల్‌చల్ చేస్తోంది. ఇలాంటివారిలో ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తోంది. టీడీపీలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సామాజికవర్గం ఆధిపత్యంలో ఇమడలేక రెడ్డి, కాపు, ఇతర వర్గాలకు చెందిన నేతలు తెలుగుదేశం పార్టీని వీడుతున్నారు. 
 
ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న మాగుంట శ్రీనివాసులురెడ్డి... తన అనుచరులతో నెల్లూరులో సమావేశం నిర్వహించారు. దీనికి ముందుగానే ఆయన పలు సర్వేలు కూడా చేయించుకున్నారని తెలుస్తోంది. దీంతో ఆయన తన పోటీకి సంబంధించి సర్వే రిపోర్టుల ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నారని... ఈ కారణంగానే అనుచరులతో సమావేశమయ్యారని ఒంగోలు, నెల్లూరు రాజకీయవర్గాల్లో ప్రచారం జోరందుకుంది. 
 
మాగుంట అనుచరులు కొందరు ఆయనను వైసీపీ తరపున ఒంగోలు నుంచి పోటీ చేయాలని కోరుతుంటే... మరికొందరు మాత్రం టీడీపీ తరపున నెల్లూరు ఎంపీగా బరిలోకి దిగాలని కోరుతున్నారు. దీనిపై ఆయన ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ సమావేశం జరుగుతుండగానే సీఎం చంద్రబాబు నుంచి మాగుంటకు ఫోన్ వచ్చింది. తక్షణం అమరావతికి వచ్చి తనను కలవాలని చంద్రబాబు కోరినట్టు తెలుస్తోంది. ఆర్థికంగా బలమైన నాయకుడు కావడంతో... మాగుంట శ్రీనివాసులు రెడ్డి పార్టీని వీడకుండా చూడాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. మొత్తంమీద తెలుగుదేశం పార్టీకి దెబ్బమీద దెబ్బపడుతోంది.