1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 14 ఫిబ్రవరి 2019 (18:52 IST)

వైకాపాలోకి మరో తెలుగుదేశం ఎంపీ? నేడో రేపో తీర్థం...

సార్వత్రిక ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో రాష్ట్రంలో జంపింగ్‌లు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా, అధికార పార్టీలో కీలకంగా ఉండి గత ఐదేళ్ళ పాటు అధికారాన్ని అనుభవించిన అనేక మంది నేతలతో పాటు.. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రాదని భావించిన పలువురు నేతలు వైకాపాలో చేరేందుకు క్యూ కడుతున్నారు. 
 
ఈ కోవలో ఇప్పటికే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌లు ఉన్నారు. వీరిద్దరూ టీడీపీకి రాజీనామా చేసి వైకాపాలో చేరిపోయారు. ముఖ్యంగా, అవంతి శ్రీనివాస్ గురువారం పార్టీ పదవితో పాటు ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసి జగన్ చెంతకు చేరారు. 
 
ఈ పరిణామంతో తెదేపా శ్రేణుల్లో దిగ్భ్రాంతికి గురయ్యారు. పార్టీలో కీలకంగా ఉంటూ వచ్చిన అవంతి శ్రీనివాస్ రాత్రికిరాత్రే పార్టీ మారడంతో టీడీపీ నేతలు, ఆయన అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. 
 
ఇదిలావుంటే, మరో టీడీపీ ఎంపీ కూడా పార్టీ మారే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన పేరు రవీంద్రబాబు. ఈయన అమలాపురం లోక్‌సభ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈయన ఒకటి రెండు రోజుల్లో జగన్‌ను కలిసే అవకాశాలున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రవీంద్ర బాబు పార్టీలోనే ఉంటాడని టీడీపీ నేతలు చెబుతున్నారు. 
 
అలాగే, తాను పార్టీ మారబోతున్నట్టు సాగుతున్న ప్రచారంపై కూడా ఎంపీ రవీంధ్రబాబు స్పందించారు. ఇవన్నీ గాలి వార్తలేనని, తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. పైగా, తనపై కుట్రపూరితంగానే దుష్ప్రచారం సాగుతోందని ఆరోపించారు.