1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

కర్నూలులో వై.ఎస్.అవినాశ్ అనుచరుల వీరంగం.. మీడియా ప్రతినిధులపై దాడులు

YS Avinash Reddy
వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రధాన నిందితుడిగా భావిస్తున్న కడప ఎంపీ వై.ఎస్.అవినాశ్ రెడ్డి అనుచరులు కర్నూలులో వీరంగం సృష్టించారు. ఆదివారం రాత్రి 1.30 గంటల సమయంలో హల్చల్ చేశారు. గాయత్రి ఎస్టేట్ ప్రాంతంలోని విశ్వభారతి ఆస్పత్రి వద్ద విధి నిర్వహణలో ఉన్న పలువురు మీడియా ప్రతినిధులపట్ల వారు దౌర్జన్యంగా, అసభ్యంగా ప్రవర్తించారు. 
 
రాత్రి వేళ మీకు ఇక్కడేం పని అంటూ మీడియా ప్రతినిధులపై దాడికి తెగబడ్డారు. దీంతో మిగిలిన మీడియా ప్రతినిధులు అక్కడి నుంచి పరుగులు తీయాల్సి వచ్చింది. కొందరు మీడియా ప్రతినిధుల చేతుల్లోని కెమెరాలు లాక్కొని ధ్వంసం చేశారు. ప్రముఖ టీవీ ప్రతినిధి రామకృష్ణా రెడ్డి ప్రాణభయంతో సమీపంలోని ఓ హోటల్లోకి పరుగెత్తగా, ఆయన్ను వెంబడించారు. హోటల్ షట్టర్లు వేసి దాడి చేయబోయారు. అయితే, ఆయన బ్యాగులో ఉన్న టీవీ లోగో చూసిన వదిలివేశారు. 
 
నిజానికి ఆదివారం ఉదయం నుంచే దాదాపు 60 నుంచి 70 మంది వరకు ఎంపీ అనుచరులు ఆ ప్రాంతానికి చేరుకుని సమీపంలోని లాడ్జీలు, హోటళ్లలో బస చేశారు. రాత్రి అయ్యేసరికి మద్యం తాగి రోడ్డు మీదకు చేరుకుని తమ వీరంగం మొదలుపెట్టారు. అసలు ఆ వీధిలోకి ఇతరులెవరూ ప్రవేశించకుండా కట్టడి చేశారు. ఆసుపత్రికి సమీపంలో మీడియా ప్రతినిధులు ఎవరు ఉన్నారని ఆరా తీశారు. రోడ్డు మీద నిల్చున్నవారితో మాట్లాడి వారు మీడియా ప్రతినిధా.. కాదా? అని తెలుసుకున్నారు. 
 
వారి మొబైల్ ఫోన్లను పరిశీలించి మీడియా ప్రతినిధులు కాదని నిర్ధారించుకున్న తర్వాతే అక్కడి నుంచి పంపించారు. అవినాశ్ రెడ్డి అనుచరుల ఆవేశం చూసి పోలీసులు సైతం వారి వద్దకు వెళ్లేందుకు జంకారు. ఈ పరిస్థితిని చూసి స్థానికులు తీవ్ర భయాందోళన చెందారు. విశ్వభారతి ఆస్పత్రి ఉన్న ప్రాంతం మొత్తాన్ని పదుల సంఖ్యలో ఉన్న అవినాశ్ రెడ్డి అనుచరులు తమ అదుపులోకి తీసుకుని బీభత్సం సృష్టిస్తున్నా పోలీసులు మాత్రం స్పందించలేదు.