శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 16 డిశెంబరు 2019 (15:25 IST)

ఉన్నావ్ కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌ను దోషిగా ప్రకటించిన కోర్టు

2017 నాటి ఉన్నావ్ అత్యాచార కేసులో ప్రధాన నిందితుడు బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌ను దిల్లీలోని తీస్ హజారీ కోర్టు సోమవారం దోషిగా ప్రకటించింది. సెంగార్‌కు విధించాల్సిన శిక్షపై ఈ నెల 19న గురువారం కోర్టు వాదనలు విననుంది. మరో నిందితుడు శశి సింగ్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఉన్నావ్‌ అత్యాచారానికి సంబంధించిన కేసులను సుప్రీంకోర్టు గతంలో ఉత్తర్‌ప్రదేశ్ నుంచి దిల్లీకి బదిలీ చేసింది.

 
ఎప్పుడేం జరిగింది?
2017 జూన్ 4- ఉద్యోగం ఇప్పించాలని అడగడానికి తాను బంధువులతో కలిసి ఎమ్మెల్యే కులదీప్ సెంగర్ ఇంటికి వెళ్తే ఆయన తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఒక మైనర్ బాలిక ఆరోపించింది. ఉద్యోగం వచ్చేందుకు సాయం చేయమని అగడగడానికి బంధువులతో కలిసి ఆయన ఇంటికి వెళ్లానని, ఎమ్మెల్యే తనపై అత్యాచారం చేశారని బాధితురాలు చెప్పింది.

 
కానీ, పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడంతో యువతి కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరులు తమ ఫిర్యాదు తీసుకోకుండా పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారని బాలిక ఆరోపించింది.

 
2017 జూన్ 11: ఆ తర్వాత బాలిక కనిపించకుండా పోయింది. ఆ తర్వాత బాధితురాలి కుటుంబ సభ్యులు ఆమె కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు.
 
2017 జూన్ 20: బాధితురాలు ఔరయ్యా గ్రామంలో కనిపించింది. తర్వాత రోజు ఆమెను ఉన్నావ్ తీసుకొచ్చారు.
 
2017 జూన్ 2017: బాధితురాలిని కోర్టులో హాజరు పరిచారు. సీఆర్పీసీ సెక్షన్ 164 ప్రకారం ఆమె వాంగ్మూలం నమోదు చేశారు. పోలీసులు వాంగ్మూలంలో ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ పేరు చెప్పనివ్వలేదని ఆమె ఆరోపించారు.
 
2017 జులై 3: వాంగ్మూలం నమోదు చేసిన 10 రోజుల తర్వాత బాధితురాలిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. బాధితురాలు దిల్లీ వచ్చి పోలీసులు తనను వేధించారని చెప్పింది. ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగర్, అతడి సోదరుడు అతుల్ సింగ్ సెంగర్ పేర్లను ఎఫ్ఐఆర్‌లో చేర్చాలని బాధితురాలు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ను కోరింది.
 
2018 ఫిబ్రవరి 24: బాధితురాలి తల్లి బయటికొచ్చారు. ఉన్నావ్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఈ కేసులో సీఆర్పీసీ సెక్షన్ 156(3) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరింది.
 
2018 ఏప్రిల్ 3- బాధితురాలి తండ్రికి, కులదీప్ సింగ్ సెంగర్ సోదరుడు అతుల్ సింగ్ సెంగర్ మధ్య ఘర్షణ జరిగింది.
 
2018 ఏప్రిల్ 4: ఆ తర్వాత ఉన్నావ్ పోలీసులు బాలిక తండ్రిని ఆర్మ్స్ యాక్ట్‌ కేసులో అరెస్టు చేశారు.
 
2018 ఏప్రిల్ 8: బాధితురాలు ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సీఎం ఆదిత్యనాథ్ ఇంటి ముందు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది.
 
ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యం చూపుతున్నారంటూ ఆరోపించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత తమను బెదరించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
 
2018 ఏప్రిల్ 9: బాలిక తండ్రి పోలీసు కస్టడీలో మృతి చెందారు. తర్వాత సోషల్ మీడియాలో బాధితురాలి తండ్రి కనిపిస్తున్న వీడియో, ఫొటోలు వైరల్ అవడంతో ఈ కేసు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఈ పరిణామాలను దురదృష్టకరంగా పేర్కొన్నారు.
 
లఖ్‌నవూ ఏడీజీని ఈ కేసును లోతుగా విచారించమని ఆదేశించిన యోగీ, దోషులు ఎంతటి వారైనా, ఏ స్థానంలో ఉన్నవాళ్లయినా సహించబోమన్నారు.
 
2018 ఏప్రిల్ 10: బాధితురాలి తండ్రి పోస్టుమార్టం రిపోర్టులో అతడికి 14 చోట్ల గాయాలు ఉన్న విషయం బయటికొచ్చింది. ఈ కేసులో ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. మేజిస్ట్రేట్ విచారణకు కూడా ఆదేశించారు. రెండు నెలల తర్వాత ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి కూడా మృతిచెందాడు.
 
2018 ఏప్రిల్ 11: యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది.
 
2018 ఏప్రిల్ 12: మైనర్ రేప్ కేసులో ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగర్‌ను నిందితుడుగా చేర్చారు. కానీ అరెస్టు చేయలేదు. ఈ కేసులో స్వయంగా జోక్యం చేసుకున్న అలహాబాద్ హైకోర్టు కులదీప్ సింగ్‌ను అరెస్ట్ చేస్తారా, చేయరా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
 
2018 ఏప్రిల్ 13: ఎమ్మెల్యేను విచారించడానికి సీబీఐ అతడిని అదుపులోకి తీసుకుంది. తర్వాత అరెస్టు చేసింది. కేసులో కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
 
2018 జులై 11: సీబీఐ ఈ కేసులో మొదటి చార్జిషీటు దాఖలు చేసింది. అందులో ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగర్ పేరును చేర్చింది.
 
2018 జులై 13: ఇదే కేసులో రెండో చార్జిషీటు నమోదైంది. ఇందులో బాధితురాలి తండ్రిని తప్పుడు ఆరోపణలతో ఇరికించారని కులదీప్ సింగ్ సెంగర్, అతడి సోదరుడు అతుల్ సింగ్ సెంగర్, కొంతమంది పోలీసులను నిందితులుగా చేశారు.
 
బాధితురాలు మైనర్ కావడంతో కులదీప్ సింగ్ సెంగర్‌పై పోక్సో యాక్ట్(ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్, 2012) కింద కూడా ఈ కేసు నమోదు చేశారు. ఈ కేసులో కులదీప్ సింగ్ సెంగర్, అతుల్ సెంగర్ సహా ఏడుగురు నిందితులు ఉన్నారు.
 
2019 జులై 28: బాధితురాలు తన పిన్ని, అత్త, వకీలుతో రాయ్‌బరేలీ వెళ్తున్న సమయంలో. వారు ప్రయాణిస్తున్న డిజైర్ కారును 12 చక్రాల ఒక ట్రక్కు ఢీకొంది. ఈ ఘోర ప్రమాదంలో బాధితురాలి పిన్ని, అత్త మృతి చెందారు.
 
తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు, ఆమె వకీలుకు లఖ్‌నవూలోని కింగ్ జార్జి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇద్దరూ లైఫ్ సపోర్టుపై ఉన్నారు.
 
2019 జులై 30: మైనర్ బాలికపై అత్యాచారం, తదనంతర పరిణామాలపై ప్రతిపక్షాల విమర్శలతో బీజేపీ పార్టీ నుంచి కులదీప్ సింగ్ సెంగార్‌ను సస్పెండ్ చేసింది.