1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : మంగళవారం, 19 నవంబరు 2019 (17:28 IST)

హాంకాంగ్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఆకలి, చలి... బయటకొస్తే జైలు

హాంకాంగ్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ క్యాంపస్‌లో 100 మంది నిరసనకారులు పోలీసు దిగ్బంధంలో ఉన్నారు. మూడు రోజులుగా ప్రతిష్టంభన నెలకొనడంతో లోపలున్న 100 మంది నిరసనకారుల వద్ద ఆహారం నిల్వలు కూడా అడుగంటాయని, ఇంకో రోజు వరకు సరిపడా ఆహారం లేదని చెబుతున్నారు. వారు బయటకొస్తే అల్లర్లకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అరెస్టు చేసి జైలులో పెడతారని భావిస్తున్నారు.

 
ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఏమాత్రం తగ్గకపోవడంతో యూనివర్సిటీ యుద్ధ క్షేత్రంగా మారిపోయింది. ముఖాలకు మాస్క్ వేసుకోవడంపై నిషేధం విధిస్తూ హాంకాంగ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను చైనా తిరస్కరించడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఆదివారం రాత్రి 10 గంటల్లోగా వెళ్లిపోవాలని పోలీసులు నిరసనకారులను హెచ్చరించినా వారు క్యాంప‌స్‌ను ఖాళీ చేయలేదు. పోలీసులు తరువాత క్యాంపస్ చుట్టుముట్టగా నిరసనకారులు పెట్రోల్ బాంబులు, రాళ్లు విసిరారు.

 
సోమవారం క్యాంపస్ నుంచి బయటకు పారిపోయేందుకు ప్రయత్నించిన చాలామంది నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. కొద్దిమంది మాత్రం తాళ్ల నిచ్చెనల సహాయంతో బయటకు దిగి తప్పించుకోగలిగారు. అరెస్టయిన వారిపై అల్లర్లకు పాల్పడ్డారన్న అభియోగంతో కేసులు పెట్టే అవకాశముంది.. దానికి పదేళ్ల వరకు జైలు శిక్ష పడొచ్చు. జూన్‌లో నిరసనలు మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు జరిగిన ఆందోళనల్లో ఈ పాలిటెక్నిక్ యూనివర్సిటీ నిరసనలే అతి పెద్దవి. పోలీసుల క్రౌర్యం, సార్వత్రిక ఓటు హక్కు వంటి అయిదు ప్రధాన డిమాండ్లతో యువత నిరసన తెలుపుతున్నారు.

 
ఈ రోజు ఏమి జరుగుతోంది?
100 మంది నిరసనకారులు పాలిటెక్నిక్ యూనివర్సిటీలో ఉన్నారని అధికారులు చెబుతున్నారు. కొద్దిమంది అక్కడి నుంచి తప్పించుకోగలుగుతున్నా మరికొందరు చలి, కాలి గాయాలతో బాధపడుతున్నారని వార్తాసైట్ ఎస్సీఎంపీ వెల్లడించింది. ఆకలి, చలి వల్ల బయటకు వచ్చేయాలని నిర్ణయించుకున్నానని ఓ ఆందోళనకారుడు చెప్పాడు. గాయపడినవారికి లోపల మందులు కూడా లేవని ఆయన చెప్పారు.

 
తాను లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు పదహారేళ్ల ఓ యువతి రాయిటర్స్ వార్తాసంస్థతో తెలిపింది. ''నిన్న ఉదయం నుంచి తప్పించుకోవడానిక ప్రయత్నిస్తున్నాం కానీ అవకాశం దొరకలేదు'' అన్నారామె. కేసులు పెడతారని భయమేసిందని.. అందుకే లొంగిపోవడానికి మించి మార్గం లేకపోయిందని చెప్పారామె. కాగా మంగళవారం ఉదయం సుమారు 200 మంది విద్యార్థులు కొందరు విద్యాశాఖ అధికారుల సహాయంతో బయటపడ్డారు.

 
లోపలున్నవారిలో 18 ఏళ్ల లోపు వారి వివరాలు తీసుకుని విడిచిపెట్టారు. 18 ఏళ్లు దాటిన సుమారు 100 మందిని అరెస్టు చేశారు. పోలీసుల సూచనలు పాటించి నిరసనకారులంతా లొంగిపోవాలని హాంకాంగ్ నేత కేరీ లాం కోరారు.

 
క్యాంపస్‌లో ఎందుకు ?
కొద్ది నెలలుగా కొనసాగుతున్న హాంకాంగ్ నిరసనల్లో ఎక్కువగా యువత, విద్యార్థులే ఉన్నప్పటికీ ఇంతవరకు యూనివర్సిటీ క్యాంపస్‌లు ఆందోళనలకు వేదిక కాలేదు. కానీ, ఇటీవల 22 ఏళ్ల ఓ విద్యార్థి మరణం తరువాత పరిస్థితి మారిపోయింది. గత వారం చైనీస్ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ రణరంగంగా మారింది. ఆందోళన చేసిన విద్యార్థులు సమీపంలోని రోడ్డుపై ట్రాఫిక్‌ను ఆపడానికి పెట్రోలు బాంబులు విసరగా పోలీసులు వారిని అడ్డుకోగా రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్ఘణలు చెలరేగాయి. దాంతో యూనివర్సిటీని క్లాసులు రద్దు చేసి మూసివేశారు.
 
ఆ తరువాత పాలిటెక్నిక్ యూనివర్సిటీ విద్యార్థులు సమీపంలోని ఒక సొరంగ మార్గాన్ని స్తంభింపజేయడానికి ప్రయత్నించారు.