శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (21:51 IST)

ఉల్లిరసంలో కొంచెం తేనె కలిపి రాసుకుని...

టీనేజ్ అమ్మాయిలను సౌందర్యపరంగా బాధించే సమస్యల్లో మొటిమలు సమస్య ఒకటి. వాటివల్ల భరించలేని నొప్పితో పాటు.. ముఖం అందవిహీనంగా కనిపిస్తుంది. దీంతో వారు తమ స్నేహితుల మధ్య కలిసిమెలసి ఉండలేక లోలోపల ఇబ్బందిపడుతుంటారు. మొటిమలు తగ్గినచోట మచ్చలు ఏర్పడి జీవితాంతం బాధిస్తూనే ఉంటాయి. 
 
ఇలాంటి వాటిని తగ్గించేందుకు గృహ చిట్కాలకు పాటిస్తే కొంతమేరకు ఉపశమనం పొందవచ్చు. శెనగపిండిలో పెరుగు కలిపి పేస్ట్‌లా తయారుచేసి ముఖానికి పట్టించాలి. ఇది 20 నిమిషాల పాటు అలానే ఉంచి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. తరచుగా ఇలా చేస్తే మొటిమలు తగ్గుతాయి. 
 
ఉల్లిరసంలో కొంచెం తేనె కలపాలి. దీన్ని మొటిమల మచ్చలపై రాయాలి. గంట తర్వాత సున్నిపిండితో కడిగితే మంచి ఫలితం లభిస్తుంది. ఇవేకాకుండా, గులాబీ రేకులు, బచ్చలి ఆకులు నూరి ముఖానికి రాసుకుని అర్థ గంట తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మొటిమల బాధ నుంచి కొంతమేరకు ఉపశమనం పొందవచ్చని బ్యుటీషియన్లు అభిప్రాయపడుతున్నారు. 
 
ఒక స్పూన్ మెంతులపొడి, ఒక స్పూన్ పసుపుపొడి, దోసకాయగుజ్జు, ఒక స్పూన్ టమోట రసం, కొబ్బరినీళ్లు కలిపి ముఖానికి రాయాలి. 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. మెంతికూర, వేపాకు చిగుళ్లు, పసుపు కలిపి నూరాలి. 
 
ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టి ఐదు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండు లేక మూడుసార్లు చేస్తే మొటిమలు, వాటి తాలూకు మచ్చలు మాయమవుతాయి.