శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 24 మార్చి 2020 (10:55 IST)

మోడీ సర్కారు దొంగ దెబ్బ... లీటరు పెట్రోల్‌పై రూ.18 పెంపు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారు మరోమారు దొంగదెబ్బ కొట్టింది. కోరనా వైరస్ కారణంగా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతోంది. ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు వీలుగా ఎన్డీఏ సర్కారు దొంగదెబ్బ కొట్టింది. 
 
ప్రత్యేక పరిస్థితుల్లో లీటరు పెట్రోల్‌పై రూ.18 వరకూ, డీజిల్‌పై రూ.12 వరకూ ఎక్సైజ్ సుంకాలను పెంచుకునేలా చట్ట సవరణ చేసింది. ఈ సవరణను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించగా, లోక్‌‌సభలో ఎటువంటి చర్చ జరగకుండానే ఆమోదం పొందినట్టు స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా ప్రకటించారు. 
 
ఇంతకుముందు పెట్రోల్‌‌పై రూ.10, డీజిల్‌‌పై రూ.4 వరకు మాత్రమే ఎక్సైజ్‌ సుంకం పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి చట్ట పరంగా అవకాశం ఉండేది. ఇది ఇపుడు రూ.18, రూ.12కు పెంచుతూ చడీచప్పుడు లేకుండా చట్టసవరణ చేసింది. 
 
ఇటీవలికాలంలో నెలకొన్న అంతర్జాతీయ అనిశ్చితి క్రూడాయిల్ మార్కెట్‌ను కుదేలు చేశాయి. ఇప్పటికే బ్యారల్ ముడి చమురు ధర 30 డాలర్ల దిగువకు పడిపోయింది. చమురు ధరలు కనిష్ఠ స్థాయులకు చేరడంతో, కేంద్ర ఖజానాకు ఆదాయం తగ్గింది. దీంతో ఈ నెల 14న పెట్రోల్, డీజిల్ పై రూ.3 చొప్పున సుంకాన్ని పెంచుతూ కేంద్రం నిర్ణయించింది. 
 
ఈ చర్యతో రూ.39 వేల కోట్ల అదనపు ఆదాయం సమకూరనుంది. ఇదే సమయంలో పెట్రో ఉత్పత్తుల ధరలు మరింతగా తగ్గే అవకాశం ఉండటంతో, భవిష్యత్తులోనూ ఎక్సైజ్ సుంకాలను పెంచుకునే వెసులుబాటు తమ వద్ద ఉంచుకునేందుకే కేంద్రం ఈ చట్ట సవరణను తెరపైకి తెచ్చిందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.