బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (12:49 IST)

పెట్రోల్ బాదుడుకు బ్రేక్ పడింది.. ఎన్నికల ఎఫెక్టేనా?

ఎట్టకేలకు దేశంలో పెట్రో ధరల పెరుగుదలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. గడిచిన రెండు వారాలుగా ప్రతి రోజూ పెరుగుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల సోమవారం కనిపించలేదు. అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్ ధర పెరిగినప్పటికీ.. దేశీయంగా మాత్రం పెట్రోల్ ధరలు పెరగపోవడానికి బలమైన కారణం లేకపోలేదు.
 
త్వరలోనే దక్షిణాదిలోని తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలతో పాటు వెస్ట్ బెంగాల్, అస్సాం రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ కారణంగానే పెట్రోల్ ధర పెరుగుదలకు తాత్కాలిక బ్రేక్ పడిందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం మూడు రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్న బీజేపీ, గతంలో ఎన్నికలు వచ్చిన సమయంలోనూ పెట్రో ధరలను రెండు, మూడు నెలల పాటు సవరించలేదని, అదే వ్యూహాన్ని ఇప్పుడు కూడా అమలు చేసేందుకు సిద్ధమైందని ఈ రంగంలోని నిపుణులు వ్యాఖ్యానించారు.
 
ఇప్పటికే పెట్రోలు ధర దేశంలోని చాలా ప్రాంతాల్లో సెంచరీ కొట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ స్థాయిలో ధరల పెరుగుదలకు కేంద్ర, రాష్ట్ర పన్నులే కారణమన్న విషయం కూడా విదితమే. చాలా దేశాల్లో పెట్రోలు ధరలు భారత్‌తో పోలిస్తే తక్కువగానే ఉన్నాయి. పొరుగున ఉన్న పాకిస్థాన్, బంగ్లాదేశ్ లోనూ ధరలు తక్కువగా ఉంటే, ఇక్కడ మాత్రం సుంకాల పేరుతో వాస్తవ ధరలతో పోలిస్తే రెట్టింపును వసూలు చేస్తున్నారు.
 
ఇక ఎన్నికల పుణ్యమాని కొన్ని వారాల పాటు ధరలను పెంచే అవకాశాలు లేవని, ఈలోగా ఇంటర్నేషనల్ మార్కెట్ ధరల సరళిని పరిశీలించి, ఎన్నికల తర్వాత తిరిగి ధరలను పెంచవచ్చని తెలుస్తోంది. పెట్రోలు ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయని ఇప్పటికే నిరసనలు మొదలయ్యాయి. 
 
బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ప్రజలు సామాజిక మాధ్యమాల ద్వారా తమ అభిప్రాయాలను చెబుతూ, మీమ్స్‌ను వైరల్ చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు మాత్రం ప్రజలపై ఉన్న భారాన్ని తగ్గించేలా సుంకాలను తగ్గించినా, అది కేవలం రూ.3 నుంచి రూ.5 వరకే పరిమితమైంది.
 
ఈ నేపథ్యంలో ప్రజల నుంచి ధరల పెంపుపై వ్యతిరేకత పెరగకుండా చూసుకోవాలని కేంద్ర పెద్దలు భావిస్తున్నారు. అందుకే ఎక్సైజ్ సుంకాలను కొంత మేరకు ఉపసంహరించుకోవాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే భావిస్తోంది.