1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 జూన్ 2021 (11:46 IST)

తెలంగాణాలో సెంచరీ కొట్టిన పెట్రోల్ ధర -న్యూయార్క్ నగరం కంటే...

దేశంలో పెట్రోల్, డీజల్ ధరలు మండిపోతున్నాయి. వీటి ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇటీవల వివిధ రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల తర్వాత ఇంధన ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ పన్నులు, రాష్ట్ర ప్రభుత్వాల ట్యాక్సులు అన్నీ కలిసి వాహనదారుల నడ్డి విరిచేస్తున్నాయి. తెలంగాణలో సైతం పెట్రోల్ ధర సెంచరీ దాటింది.
 
ఆదిలాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.100.23 పైసలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు పెరుగుతుండటం మన మార్కెట్‌పై ప్రభావం చూపుతోంది. ఏపీలో కూడా పెట్రోల్ ధరలు రూ.100 మార్క్‌ను దాటేసిన సంగతి తెలిసిందే. 
 
మరోవైపు దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. ముఖ్యంగా, అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్‌ కన్నా భారత ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్‌ ధర అధికంగా ఉండటం గమనార్హం. 
 
న్యూయార్క్‌లో లీటరు పెట్రోల్‌ ధర దాదాపు రూ.57 (0.79 డాలర్లు) ఉంటే.. ముంబైలో రూ.100.72 పలుకుతున్నది. అంటే దాదాపు రెట్టింపు. కేంద్రానికి ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటైన ఇంధన ధరలు ఇటీవల వరుసగా పెరుగుతున్నాయి. 
 
ఇటీవల నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత వరుసగా 17 సార్లు ధరలను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు పెంచాయి. మంగళవారం లీటరు పెట్రోల్‌పై 26 పైసలు, డీజిల్‌పై 23 పైసలను పెంచడంతో ధరలు రికార్డుస్థాయికి చేరాయి. 
 
దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.94.49కి చేరగా, డీజిల్‌ ధర రూ.85.38కి పెరిగింది. ఇప్పటికే రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో లీటరు పెట్రోల్‌ ధర రూ.100 దాటిన విషయం తెలిసిందే.