1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 3 నవంబరు 2021 (09:58 IST)

పెట్రో వాతకు తాక్కాలికంగా బ్రేక్ వేసిన చమురు కంపెనీలు

పెట్రో వాతకు కేంద్ర చమురు కంపెనీలు తాత్కాలికంగా బ్రేక్ వేశాయి. బుధవారం పెట్రో వడ్డింపును ఆపాయి. వరుసగా వారం రోజుల పాటు పెరుగుతూ వచ్చిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను బుధవారం పెంచలేదు. 
 
మంగళవారం నాటి ధరలనే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో చమురు ధరలు తగ్గకపోయినప్పటికీ సగటు వేతన జీవులకు మరో 35 పైసల భారం తప్పింది. ఇప్పటికే చుక్కలనంటిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో మార్కెట్‌లో ప్రతి వస్తువు ధరలు పెరిగిపోయాయి. 
 
తాజాగా చమురు ధరలు పెరగకపోవడంతో వినియోగదారులకు కొంతలో కొంతైనా ఉపశమనం లభించినట్లయింది. మంగళవారం పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 35 పైసలను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు పెంచిన విషయం తెల్సిందే. దీంతో ఇంధన ధరలు దేశవ్యాప్తంగా రికార్డుస్థాయికి చేరాయి. 
 
ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర ఏకంగా రూ.110.04కు పెరుగగా.. డీజిల్‌ ధర రూ.98.42కి చేరింది. ముంబైలో లీటరు పెట్రోల్‌ ధర రూ.115.85కి ఎగబాకగా.. డీజిల్‌ ధర రూ.106.62కు పెరిగింది. ఇక కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.110.49, డీజిల్‌ రూ.101.56, చెన్నైలో పెట్రోల్‌ రూ.106.66, డీజిల్‌ రూ.102.59, హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.114.49, డీజిల్‌ రూ.107.40గా ఉన్నాయి.