1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 నవంబరు 2021 (09:32 IST)

వాణిజ్య సిలిండర్ ధర రూ.265 పెంపు

దేశంలో ఒకవైపు పెట్రోల్ ధరలు, మరోవైపు గ్యాస్ ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. తాజాగా చమురు కంపెనీలు వినియోగదారులకు తేరుకోలేని షాకిచ్చాయి. వాణిజ్య సిలిండర్‌ ధరను రూ.265కు పెంచగా.. ఎల్‌పీజీ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ఈ పెరిగిన ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి.
 
తాజాగా పెంచిన ధరలతో కమర్షియల్‌ సిలిండర్‌ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ.2000 మార్క్‌ను దాటింది. ఇంతకుముందు ధర రూ.1735గా ఉండేది. ప్రస్తుతం రూ.2,175కు పెరిగింది. ముంబైల్‌లో 19 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1950, కోల్‌కతాలో రూ.2073.50, చెన్నైలో ధర రూ.2133కు చేరింది. 
 
ఇప్పటికే ఆల్‌టైమ్‌ రికార్డు స్థాయికి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు చేరగా.. గ్యాస్‌ ధరలు సైతం చుక్కలనంటుతుండడంతో దుకాణదారులు బెంబేలెత్తుతున్నారు. వాణిజ్య సిలిండర్లను ఎక్కువగా హోటల్స్‌, రెస్టారెంట్లు వినియోగిస్తుంటాయి. ఇదిలావుంటే, ఢిల్లీలో 14.2 కేజీల నాన్ సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర రూ.899.50 పలుకుతోంది. 
 
కాగా, గతంలో అక్టోబరు ఒకటో తేదీన 19 కిలోల వాణిజ్య సిలిండర్, 6న ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్ల ధరలు పెరిగాయి. ప్రస్తుతం 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్‌ ధర కోల్‌కతాలో రూ.926, చెన్నైలో రూ.915.50 ధర పలుకుతున్నది. 
 
ఇటీవల పెరుగుతూ వస్తున్న ముడిచమురు ధరల దృష్ట్యా ఈ సారి ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.1000 దాటుతుందనే ఆందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే రూ.100 వరకు పెంచే అవకాశం ఉందని వార్తలు వచ్చిన నేపథ్యంలో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.