శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 21 జూన్ 2020 (11:17 IST)

చెన్నై మహానగరంలో 800 పోలీసులకు కరోనా పాజిటివ్

దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు రెండో స్థానంలోవుంది. ముఖ్యంగా, ఆ రాష్ట్ర రాజధాని చెన్నై నగరంలో పాజిటివ్ కేసులు పుట్టగొడుగుల్లా వెలుగు చూస్తున్నాయి. అయితే, కరోనా లాక్డౌన్ సమయంలో విధులు నిర్వహిస్తున్న పోలీసుల్లో 800 మందికి ఈ వైరస్ సోకింది. ఇటీవల టి నగర్ మాంబాళం పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బాలమురళి కరోనా వైరస్ బారినపడి చనిపోయిన విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో చెన్నై నగరంలో విధులు నిర్వహించే పోలీసుల్లో 800 మందికి ఈ వైరస్ సోకినట్టు సమాచారం. రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి రోజురోజుకూ అధికమవుతోంది. ఒక్క చెన్నైలో మాత్రం 10 రోజులుగా ప్రతిరోజూ వెయ్యికి పైగా పాజిటిక్‌ కేసులు నమోదవుతున్నాయి. 
 
ఇదివరకు ప్రజల్లో వ్యాపిస్తున్న కరోనా ప్రస్తుతం కరోనా నిరోధక చర్యల్లో పాల్గొంటున్న పోలీసులు, వైద్యులు, నర్సులు, పారిశుధ్య కార్మికులకు సోకడం ఆందోళన కలిగిస్తోంది. 
 
కరోనా లక్షణాలతో ఓ ఇన్‌స్పెక్టర్ మృతిచెందగా, ఈ అంత్యక్రియల్లో పాల్గొన్న ఐపీఎస్‌ అధికారికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. నగరంలో 800 మంది పోలీసులకు కరోనా వైరస్‌ సోకగా వారిలో 321 మంది చికిత్సల అనంతరం డిశ్చార్జి అయినట్టు పోలీసు శాఖ తెలియజేసింది.