1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Corona: Again over 4 thousand deaths, more recovery than new cases

Corona: మళ్లీ 4 వేలకుపైగా మరణాలు,కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువ

CoronaVirus
దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి తగ్గుతున్నట్లే కన్పిస్తున్నా.. మరణాలు మాత్రం భారీ స్థాయిలో ఉంటుండం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మరోసారి రోజువారీ మరణాలు 4వేలు దాటాయి. 24 గంటల వ్యవధిలో 4205 మందిని వైరస్‌ బలితీసుకుంది. దీంతో మహమ్మారి దేశంలోకి ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటివరకు 2,54,197 మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఇక వరుసగా మూడో రోజు రోజువారీ కేసులు 4 లక్షల దిగువనే ఉండటం కాస్త ఊరటనిస్తోంది. అంతేగాక, కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉండటం సానుకూలాంశం.
 
మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 19,83,804 మంది వైరస్‌ పరీక్షలు చేయించుకోగా.. 3,48,421 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2.33కోట్లకు చేరింది. ఇదే సమయంలో 3,55,338 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు 1.93కోట్ల మంది వైరస్‌ను జయించారు. రికవరీ రేటు 83.04శాతానికి పెరిగింది.
 
ఇక వరుసగా రెండో రోజు యాక్టివ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయి. క్రితం రోజుతో పోలిస్తే దాదాపు 11వేలకు పైగా తగ్గాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 37,04,099 మంది వైరస్‌కు చికిత్స తీసుకుంటున్నారు. క్రియాశీల రేటు 15.87శాతంగా ఉండగా..మరణాల రేటు 1.09శాతంగా ఉంది.
 
మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిరంతరాయంగా సాగుతోంది. అయితే వ్యాక్సిన్ల కొరత కారణంగా చాలా చోట్ల 18ఏళ్లు పైబడిన వారందరికీ ఇంకా టీకాలు ఇవ్వడం లేదు. మంగళవారం మరో 24.46లక్షల మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఇప్పటివరకు 17.52కోట్ల మందికి టీకాలు అందించారు..
About Writer
ఎం
తర్వాతి కథనం
డాక్టర్లకు చెబితే బోర్లా పడుకోబెట్టి గుండెపై తట్టమన్నారు...