1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 26 ఏప్రియల్ 2021 (16:10 IST)

ఆసుపత్రుల బయటే కూలబడిపోతున్న కరోనా రోగులు

ఉత్తర ప్రదేశ్‌లో కరోనా వైరస్ సృష్టిస్తోన్న వినాశనం రోజురోజుకు చాలా ఘోరంగా మారుతోంది. లక్నో తరువాత కాన్పూర్‌లో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయి. కాన్పూర్‌లో మరణాల సంఖ్య చాలా పెరిగింది. అంత్యక్రియల కోసం శ్మశానవాటికల వద్ద పెద్ద సంఖ్యలో శవాలతో కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారంటే పరిస్థితి ఎంత ఘోరంగా వుందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితులపై యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చాలా ఆందోళన చెందుతోంది.
 
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా ఇప్పుడు కాన్పూర్ పరిస్థితి గురించి ప్రతి క్షణం అధికారుల ద్వారా సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. కాన్పూర్‌లోని ఆరోగ్య విభాగం పూర్తిగా విఫలమైంది, దీనివల్ల కాన్పూర్‌లో రోజూ ఇరవై నుంచి ముప్పై మంది మరణిస్తున్నారు. సరైన సమయానికి చికిత్స అందని చాలామంది బాధితులు ప్రమాదంలో పడిపోతున్నారు.
 
ఆసుపత్రులలో పడకలు లేవు, ఆక్సిజన్ లేదు. ఈ పరిస్థితిలో మొత్తం 24 మంది కోవిడ్ రోగులు ప్రభుత్వ ఆసుపత్రులలో ఆదివారం మరణించగా, కొత్త పాజిటివ్‌ కేసులు 2 వేలకు పైగా నమోదయ్యాయి. ఆసుపత్రుల వెలుపల రోగుల రద్దీ చూస్తుంటే కాన్పూర్ లోని పరిస్థితి రోజురోజుకు అధ్వాన్నంగా ఉన్నట్లు కనిపిస్తోంది. కాన్పూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రుల వెలుపల వందలాది మంది రోగులతో వారి వారి కుటుంబ సభ్యులు పడిగాపులు కాస్తున్నారు.
 
రోగులకు సరైన చికిత్స అందిస్తున్నట్లు ప్రభుత్వం వాదనలు చేస్తున్నప్పటికీ, దీనికి విరుద్ధంగా ఆసుపత్రుల వద్ద పరిస్థితి కనబడుతోంది. దాదాపు అన్ని ఆసుపత్రులలో పడకలు ఖాళీగా లేవు. ఒక మహిళ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా అత్యవసర పరిస్థితుల్లో ఎల్‌ఎల్‌ఆర్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. పడకలు మరియు ఆక్సిజన్ లేకపోవడం పట్ల వైద్యులు తమ నిస్సహాయతను వ్యక్తం చేశారు. దాంతో ఆమె అక్కడే నేల మీద కూలబడిపోయింది. ఆమె కుమార్తె వైద్యం కోసం దీనంగా ఎదురుచూస్తోంది. ఇలాంటి ఘటనలు కాన్పూర్ లోనే కాదు దేశంలో చాలాచోట్ల దర్శనమిస్తున్నాయి.