1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 14 మే 2021 (13:11 IST)

కరోనా ఉధ్ధృతి.. కాస్త తగ్గిన కరోనా.. కరోనా టీకా ప్రక్రియ వేగవంతం

దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. మరోవైపు వైరస్ కట్టడికి పలు రాష్ట్రాలు విధించిన ఆంక్షలు పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం నాలుగు లక్షల మార్కును దాటిన కేసులు.. ఐదు రోజులుగా ఆ మార్కుకు దిగువన నమోదవుతున్నాయి. 
 
గడిచిన 24 గంటల్లో కొత్తగా 3.43లక్షల మందికి కరోనా సోకింది. ఇక మరణాల సంఖ్య నాలుగువేలుగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిన్నటితో పోల్చితే కేసులు, మరణాల సంఖ్యలో కూడా తగ్గుదల కనిపిస్తోంది.
 
తాజాగా 18,75,515 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..3,43,144 మందికి కరోనా సోకినట్లు వెల్లడైంది. క్రితం రోజు(3,62,727)తో పోల్చుకుంటే కొత్త కేసులు కాస్త తగ్గాయి. దాంతో ఇప్పటివరకు రెండు కోట్ల 40లక్షల మందికి ఈ మహమ్మారి సోకగా.. రెండు కోట్ల మందికి పైగా దాన్నుంచి బయటపడ్డారు.  
 
మరోవైపు, కరోనా టీకా ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు మరిన్ని కొత్త టీకాలను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. నిన్న 20,27,160 మందికి టీకాలు అందించింది. జనవరి 16న ప్రారంభమైన ఈ కార్యక్రమం కింద ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 18 కోట్లకు చేరువైంది.