శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 28 మార్చి 2020 (13:24 IST)

ఇటలీలో కరోనా ఉగ్రరూపం... ఒక్క రోజులోనే 919 మంది మృతి

ఇటలీలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. ఒక్క రోజులోనే వెయ్యి మంది మృత్యువాతపడ్డారు. దీంతో ఇటలీలో మొత్తం మృతుల సంఖ్య పదివేలు దాటిపోయింది. అలాగే, ఈ వైరస్ బారినపడినవారి సంఖ్య 90 వేలకు చేరింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంఖ్య ఆరు లక్షలు ఉండగా, మృతుల సంఖ్య 27 వేలకు పైగా ఉంది. 
 
మరోవైరు, అగ్రరాజ్యం అమెరికా కూడా కరోనా దెబ్బకు వణికిపోతోంది. ఈ వైరస్ ధాటిని తట్టుకోలేక ఏం చేయాలో అర్థంకాని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది. సంప‌న్న దేశాలే ఈ వైర‌స్ విల‌య‌తాండ‌వాన్ని త‌ట్టుకోలేక ఉంటుంటే... ఆఫ్రికా, ఆసియాలోని అనేక దేశాలు భ‌యం, భ‌యంగా కాలం వెళ్ల‌దీస్తున్నాయి. 
 
ఇక ఇట‌లీ త‌ర్వాత అత్య‌ధిక ప్ర‌భావం ఉన్న స్పెయిన్‌లోనూ మ‌ర‌ణాల సంఖ్య భారీగానే ఉన్న‌ది. గ‌డిచిన 24 గంట‌ల్లో 769 మంది చ‌నిపోయిన‌ట్లు అక్క‌డి అధికారులు తెలిపారు. ఇప్ప‌టికే అక్క‌డ మ‌ర‌ణాల సంఖ్య 5 వేల‌కు ద‌గ్గ‌ర్లో ఉంది. అటు ప్రాన్స్‌లో ఇక్క‌రోజులోనే మ‌ర‌ణాల సంఖ్య మూడు వంద‌లు ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు అక్క‌డ 2 వేల మంది మ‌ర‌ణించారు. 
 
ద‌క్షిణ‌ కొరియాలో కొత్త‌గా 144 కేసులు న‌మోదు కాగా బాధితుల సంఖ్య ప‌దివేల‌కు చేరువైంది. అయితే అక్క‌డ స‌గం మందికి పైగా కోలుకోవ‌డం విశేషం. ఇక తొలుత వైర‌స్ పుట్టిన చైనాలో మ‌రో ముగ్గురు మృతి చెందిన‌ట్లు అక్క‌డి ప్ర‌భుత్వం తెలిపింది. కొత్త‌గా మ‌రో 58 మందికి ఈ వైర‌ల్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో చైనాలో బాధిత‌లు సంఖ్య 81,394 ఉండ‌గా, మ‌ర‌ణాల సంఖ్య 3,295కి చేరింది.