గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 28 మార్చి 2020 (11:46 IST)

ఫంక్షన్‌కు వెళ్ళిన తల్లి... వైరస్‌తో వచ్చి 9 నెలల బిడ్డకూ అంటించింది.. ఎక్కడ?

ఓ తల్లి చేసిన చిన్నపొరపాటు.. తొమ్మిది నెలల చిన్నారి పాలిట శాపంగా మారింది. ఆ చిన్నారిని కరోనా కాటేసింది. దీంతో ఆ చిన్నారిని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని తెహట్ట ప్రాంతంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పశ్చిమ బెంగాల్‌లోని తెహట్ట ప్రాంతానికి చెందిన ఓ యువకుడు యూకేలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు. అతను మార్చి రెండో వారంలో ఢిల్లీకి వచ్చాడు. అనంతరం ఎయిర్‌పోర్టు సిబ్బంది అతనికి కరోనా పరీక్షలు నిర్వహించి, క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. కానీ, పోలీసులు, సిబ్బంది కన్నుగప్పి.. క్వారంటైన్‌ నుంచి పారిపోయాడు. ఆ తర్వాత తెహట్టలో నిర్వహించిన ఫ్యామిలీ ఫంక్షన్‌కు వెళ్లాడు. 
 
ఈ ఫంక్షన్‌కు 9 నెలల బిడ్డతల్లి వచ్చింది. ఈమెకు ఆ యువకుడి ద్వారా కరోనా వైరస్ సోకింది. ఆ తర్వాత మార్చి 23న మహిళ కుటుంబ సభ్యులు జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రికి వెళ్లారు. కుటుంబ సభ్యులకు కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెప్పారు. నదియాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో క్వారంటైన్‌లో కుటుంబ సభ్యులైన 8 మందిని ఉంచారు. 27వ తేదీన వీరికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. 
 
ఈ ఐదుగురిలో 27 ఏళ్ల మహిళతో పాటు ఆమె కూతురు(9 నెలలు), మరో కూతురు(6 యేళ్లు) ఉంది. 45 ఏళ్ల మహిళకు కూడా సోకింది. ఆమె కుమారుడికి(11) కూడా కరోనా వ్యాప్తి చెందినట్లు నిర్ధారణ అయింది. ఈ ఐదుగురిని ఇప్పుడు కోల్‌కతాలోని ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ఫ్యామిలీతో సన్నిహితంగా మెలిగిన మరో 18 మందిని క్వారంటైన్‌లో ఉంచారు. పశ్చిమ బెంగాల్‌లో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 15కు చేరింది.