శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 మార్చి 2020 (18:40 IST)

కిల్లర్ కరోనా... 24 అర్థరాత్రి నుంచి విమాన సర్వీసులు బంద్

దేశంలో కరోనా వైరస్ కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. అలాగే, మృతుల సంఖ్య కూడా ఎక్కువైపోతోంది. ఈ క్రమంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. దీంతో రైళ్లు, బస్సులు నిలిచిపోయాయి. ప్రజా రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. 
 
అంతేకాకుండా, కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేయగా, ఇప్పుడా జాబితాలో దేశీయ విమాన సర్వీసులు కూడా చేరాయి. దేశీయ విమానయాన సంస్థల కార్యకలాపాలను ఈ నెల 24 అర్థరాత్రి నుంచి నిలిపివేయాలని నిశ్చయించారు. తద్వారా దేశీయ రూట్లలో తిరిగే ప్రయాణికుల విమానాలు నిలిచిపోనున్నాయి. అయితే, రవాణా విమానాలకు ఈ నిర్ణయం వర్తించదు.
 
అంతకుముందు.. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీహార్ సీఎం నితీశ్ కుమార్‌లు తమ తమ రాష్ట్రాలకు నడిచే స్వదేశీ విమాన సర్వీసులను నిలిపివేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. 
 
దేశవ్యాప్తంగా కరోనా కారణంగా దాదాపు 80 జిల్లాల్లో లాక్‌డౌన్ అయిన తరుణంలో ఆమె తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. దేశంలో కరోనా విస్తరిస్తోందని... ఈ  పరిస్థితుల్లో కూడా దేశంలో విమాన రాకపోకలు యథాతథంగా కొనసాగుతున్నాయని ఆమె విమర్శించారు. 
 
విమానాలు తిరిగితే షట్ డౌన్‌కు అర్థం లేదని... క్వారంటైన్ విధానాలకు కూడా ఇది తూట్లు పొడుస్తుందని అన్నారు. విమానాల్లో ప్రయాణికుల మధ్య సామాజిక దూరం ఉండదని... పక్కపక్కనే కూర్చుని ప్రజలు ప్రయాణిస్తారని... దీనివల్ల  వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని పేర్కొన్నారు.
 
ఈ నేపథ్యంలో తమ రాష్ట్రానికి వచ్చే అన్ని విమాన సర్వీసులను తక్షణమే రద్దు చేయాలని మోడీకి మమతా బెనర్జీ విన్నవించారు. అప్పుడే కరోనా మహమ్మారి విస్తరణకు తమ రాష్ట్రంలో అడ్డుకట్ట వేయగలమని... పశ్చిమబెంగల్ లాక్ డౌన్‌ను పూర్తి  స్థాయిలో అమలు చేయగలుగుతామని చెప్పారు. ఇదే తరహా అభిప్రాయాన్ని బీహార్ సీఎం కూడా వెలిబుచ్చారు. దీంతో కేంద్రం స్పందించింది.