శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 మార్చి 2020 (14:27 IST)

డబ్బు - మతం కంటే మనిషిగా ఉందాం... సాయం చేసుకుందాం : షోయబ్ అక్తర్

ప్రస్తుతం ప్రపంచం ఓ మహా విపత్తును ఎదుర్కొంటోందని, ఇలాంటి సమయంలో డబ్బు, మతం కంటే ఓ మనిషిగా ఉంటూ ఒకరికొకరు సాయం చేసుకుందామని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ పిలుపునిచ్చారు. మహమ్మారి కరోనా వైరస్ ఇపుడు ప్రపంచాన్ని బంధించిన విషయం తెల్సిందే. ఇదే అంశంపై ఆయన తాజాగా మాట్లాడుతూ, ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రజలంతా ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు. ఈ కష్టకాలంలో డబ్బు, మతం కంటే మించి ఎదగడానికి ఒకరికొకరు సాయం చేసుకోవాలని కోరాడు. 
 
'ప్రపంచం వ్యాప్తంగా నా అభిమానులందరికీ విజ్ఞప్తి. కరోనా వైరస్ అనేది ప్రపంచ సంక్షోభం. ఈ సమయంలో మనమంతా ప్రపంచ శక్తిగా ఆలోచించాలి. మతం కంటే పైకి ఎదగాలి. వైరస్ వ్యాప్తి  చెందకుండా లాక్‌డౌన్‌ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఒకరినొకరు కలుస్తూ, సమూహాలుగా ఏర్పడితే వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేం. దుకాణాలన్నీ ఖాళీ అయ్యాయి. ఒకవేళ మీరు సరకులు నిల్వ చేసుకొని ఉంటే, దయచేసి దినసరి కూలీల గురించి కూడా ఆలోచించండి. వాళ్ల కుటుంబాలు ఏం తిని బతుకుతాయో కాస్త ఆలోచించండి. పరిస్థితి ఇలానే ఉంటే మూడు నెలల తర్వాత మీ జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి? కాబట్టి  ఇతరుల గురించి కూడా పట్టించుకోండి. ఈ సమయంలో మనం మనుషుగా ఉండాలి కానీ హిందూ, ముస్లింలుగా కాదు' అని చెప్పుకొచ్చారు.
 
'ధనవంతులు ఎలాగైనా బతుకుతారు. మరి పేదలు ఎలా జీవించాలి? వారిపై కాస్త దయ చూపించండి. మనం జంతువుల్లా కాదు, మనుషుల్లా జీవించాలి. ఇతరులకు సాయం చేసే ప్రయత్నం చేయండి. దయచేసి వస్తువులను నిల్వచేసుకోవడం ఆపండి. ఇప్పుడు మనం ఇతరుల గురించి కూడా ఆలోచించాలి. అంతేకాని మన మధ్య అంతరాలు ఉండకూడదు. అందరం మనుషుల్లా జీవించాలి' అని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తన సందేశాన్ని వీడియోగా తీసి యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. ఇది ప్రస్తుతం వైర అయింది.