శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 28 జూన్ 2020 (16:24 IST)

ఆంధ్రాలో మరో 755 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 755 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 50, విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో 8 మందికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. 
 
రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 13,098కి చేరింది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 25,778 శాంపిల్స్‌ను పరీక్షించగా 755 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
 
గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 401 మంది క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారు. కరోనా బారిన పడి కర్నూలులో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, పశ్చిమగోదావరిలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7021 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 
 
ఇదిలావుంటే, తెలంగాణలో కరోనా వైరస్‌ తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. తాజాగా తెలంగాణ పోలీసు అకాడమీలో కరోనా కలకలం రేపింది. అకాడమీలోని 124 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. కరోనా సోకిన వారిలో అటెండర్‌ స్థాయి నుంచి మొదలుకుని డీఐజీ స్థాయి అధికారులు కూడా ఉన్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వారందరిని ఐసోలేషన్‌కు తరలించారు. 
 
ప్రస్తుతం పోలీసు అకాడమీలో 1900 మంది శిక్షణ పొందుతున్నారు. త్వరలోనే అకాడమీలో ఉన్నవారందరికీ కరోనా పరీక్షలు చేయనున్నట్టుగా తెలుస్తోంది. కాగా, తొలుత అకాడమీలో పనిచేసే వంట మనిషి కరోనా సోకినట్టుగా సమాచారం. మరోవైపు రాష్ట్రంలో శనివారం సాయంత్రం వరకు 13,436 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, మొత్తం 243 మంది మృతిచెందారు.