మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By వి
Last Modified: సోమవారం, 14 సెప్టెంబరు 2020 (11:20 IST)

వ్యాక్సిన్ తొలి ప్రయోగం నామీదే, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్

వ్యాక్సిన్ తొలిసారిగా వేసుకునేందుకు ఎవరూ ముందుకు రాని పక్షంలో తానే తొలుతగా ముందుకు వస్తానని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారించేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీంతో పాటు అవసరమైనంత వరకు అధికంగా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.
 
తొలుత మనదేశంలో తయారైన వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆశాభావంతో ఉన్నామన్నారు. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కంట్రోల్ రాకపోవడంతో వ్యాక్సిన్ తయారీ మరింత వేగవంతమైంది. ఇప్పటికే చాలా ఔషధ సంస్థలు రెండో దశ ప్రయోగాలు పూర్తిచేసుకొని మూడో స్టేజ్‌కి ప్రవేశించాయి. ఇక భారత్ లోను కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు ఊపందుకున్నాయి. 
 
ఈ క్రమంలోనే దేశంలో వైరస్ వ్యాప్తి, వ్యాక్సిన్ తయారీపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2021 పిబ్రవరి, మార్చి నెలల్లో కరోనా విరుగుడు అందుబాటులోకి వచ్చే అవకాశముందన్నారు. వైరస్ పైన పోరులో ముందుండి ప్రజలను రక్షిస్తున్న వైద్యులు, పోలీసులు, మున్సిపల్ సిబ్బందికి తొలుత వ్యాక్సిన్‌ను అందుబాటులోకి ఉంచుతామన్నారు.
 
అయితే ప్రయోగాలు అనంతరం తొలి వ్యాక్సిన్ తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోతే తానే స్వయంగా వ్యాక్సిన్‌ను వేసుకుంటానని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ స్పష్టం చేశారు. టీకాపై ప్రజలకు మరింత భరోసా కల్పించడానికి తొలి ప్రయోగంగా తాను అందుబాటులో ఉంటానన్నారు.