శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 సెప్టెంబరు 2020 (11:01 IST)

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం

చరిత్రలో ఇప్పటివరకు ఎన్నడూ లేనివిధంగా పార్లమెంట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ప్రత్యేక జాగ్రత్తల నడుమ ఈ సమావేశాలు మొదలయ్యాయి. ఈ సమావేశాలు మొత్తం 18 రోజుల పాటు జరుగనున్నాయి. 
 
కరోనా నేపథ్యంలో గతంలో ఎన్నడూ కనిపించని దృశ్యాలు ఈ సమావేశంలో కనిపిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో, అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలూ తీసుకున్నారు. ఏ ఒక్క సభ్యుడి పక్కనా, మరో సభ్యుడు కూర్చోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అటు లోక్‌సభ, ఇటు రాజ్యసభల్లో భౌతిక దూరాన్ని తప్పనిసరి చేశారు. సీట్లను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసేలా, పాలీ కార్బనేట్ సీట్లను ఏర్పాటు చేశారు.
 
ఇక, ప్రతి సమావేశాల్లో కనిపించే ప్రశ్నోత్తరాలు, శూన్య (క్వశ్చన్ అవర్, జీరో అవర్) గంటలను ఈ సమావేశాల్లో రద్దు చేశారు. రోజుకు కేవలం నాలుగు గంటలు మాత్రమే సభలు జరుగుతాయి. వారంలో సెలవు లేకుండా ఏడు రోజులూ సభను నిర్వహిస్తారు. 
 
కేవలం లిఖిత పూర్వక సమాధానాలు (అన్ -స్టార్డ్ క్వశ్చన్స్) కోరే ప్రశ్నలకు మాత్రమే సంబంధిత మంత్రులు సమాధానం ఇస్తారు. రాజ్యసభ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకూ, మాత్రమే పనిచేస్తుంది. సభ్యులంతా ఒకేసారి పార్లమెంట్‌కు రాకుండా చేసేందుకు ఆపై భోజన విరామం తరువాత మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 వరకూ లోక్ సభ జరుగుతుంది.
 
కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలతో సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిశ్చయించగా, ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయడాన్ని విపక్ష కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది. కేవలం తమకు అనుకూలమైన నిర్ణయాలను మాత్రమే ఎన్డీయే అమలు చేస్తోందని, బిల్లులకు ఆమోదం పొందాలన్న తొందర తప్ప, ప్రజల సమస్యలపై చర్చించాలన్న చిత్తశుద్ధి బీజేపీకి లేదని మండిపడింది.