మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (11:28 IST)

నేషనల్ పోలీస్ అకాడెమీపై కరోనా పంజా : 80 మంది సిబ్బందికి పాజిటివ్

హైదరాబాద్ నగరంలోని జాతీయ పోలీస్ శిక్షణా కేంద్రం (నేషనల్ పోలీస్ అకాడెమీ)పై కరోనా పంజా విసిరింది. ఫలితంగా ఏకంగా 80 మందికి కరోనా వైరస్ సోకింది. స్థానికంగా ఉండే సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడెమీలో పనిచేసే సిబ్బందికి సోమవారం కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఏకంగా 80 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. 
 
దీనిపై ఆ కేంద్రానికి చెందిన సీనియర్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ, శిక్షణ విధుల్లో ఉన్నవారికి కాకుండా వివిధ విభాగాల్లో పని చేసే సిబ్బందికి ఈ పరీక్షలు నిర్వహించినట్టు చెప్పారు. కాగా, ఈ కేంద్రం ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్)కు ఎంపికయ్యే వారికి ప్రధాన శిక్షణా కేంద్రంగా వుంది. 
 
ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 2,392 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,45,163కు చేరాయి. తాజాగా వైరస్‌తో 11 మంది మృతి చెందగా, మృతుల సంఖ్య 906కు చేరింది. 
 
అలాగే, వైరస్‌ నుంచి 2,346 మంది వైరస్‌ నుంచి కొలుకోగా, మొత్తం 1,12,587 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 31,670 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. మరో 24,579 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. 
 
తాజాగా నమోదైన కేసుల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిదిలో 304 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. తర్వాత రంగారెడ్డి జిల్లాలో 191, కరీంనగర్‌లో 157, మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 132, ఖమ్మంలో 116, నల్గొండలో 105, నిజామాబాద్‌లో 102, సూర్యపేటలో 101, భద్రాద్రి కొత్తగూడెంలో 95, వరంగల్‌ అర్బన్‌లో 91 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి.