శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 సెప్టెంబరు 2020 (11:53 IST)

తెలంగాణాలో 2534 - దేశంలో 95735 కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2534 మందికి ఈ వైరస్ సోకగా, దేశంలో 95735 మందికి ఈ వైరస్  సోకినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,534 కేసులు నమోదయ్యాయి. అదేసమయంలో 11 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,071 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,50,176కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,17,143  మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 927కు చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 327 కరోనా కేసులు నమోదయ్యాయి.
 
ఇకపోతే, దేశంలో క‌రోనా కేసుల సంఖ్య ఏరోజుకారోజు భారీగా పెరుగుతోంది. ఒక్క రోజులో 90 వేల‌కు పైగా కేసులు న‌మోదు అవుతుండ‌టం కేంద్రాన్ని కలవర పెడుతోంది. గత 24 గంటల్లో దేశంలో 95,735 మందికి కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 44,65,864కి చేరింది.
 
అదేసమయంలో 1,172 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 75,062కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 34,71,784 మంది కోలుకున్నారు. 9,19,018 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కాగా, దేశంలో బుధవారం వరకు మొత్తం 5,29,34,433 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 11,29,756 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.