శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్

మహారాష్ట్రలో పూర్తిస్థాయి లాక్డౌన్ లేదు : సీఎం ఉద్ధవ్ ఠాక్రే

మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చింది. ఇక్కడ పరిస్థితి చేయిదాటిపోయింది. ఈ వైరస్ వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం అనేక రకాలైన చర్యలతో ఆంక్షలు విధిస్తోంది. ఇందులోభాగంగా, మహారాష్ట్రలో బుధవారం నుంచి రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తూ సీఎం ఉద్ధవ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మహారాష్ట్రలో 15 రోజుల పాటు కొత్త ఆంక్షలు అమలు కానున్నాయి. 
 
మహారాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలవుతుంది. గురువారం రాత్రి 8 గంటల నుంచి మరిన్ని ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ప్రజలు అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటికి రావాలని ఆదేశాలు చేశారు. మహారాష్ట్రలో పూర్తిస్థాయి లాక్డౌన్ ఉండదని సీఎం ఉద్ధవ్ తెలిపారు. 
 
మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందన్నారు. రాష్ట్రంలో రోజుకు 60 వేల కేసులు నమోదవుతున్నాయని ఉద్దవ్ వెల్లడించారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌, బెడ్ల కొరత ఉందన్నారు. డాక్టర్లు, టెస్టింగ్‌ సెంటర్లపై అదనపు భారం పడుతోందని పేర్కొన్నారు. 
 
వచ్చే రెండు, మూడు వారాల్లో మరిన్ని వ్యాక్సిన్‌ డోసులు కావాలని చెప్పారు. వ్యాక్సిన్‌ సరఫరా విషయంలో కేంద్రం సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్రకు వ్యాక్సిన్ సరఫరా పెంచాలని ఉద్ధవ్ కోరారు. 
 
మహారాష్ట్ర ప్రజలకు ఇది చాలా కఠిన సమయం. మరణాల సంఖ్యను దాచడం లేదు. రెమిడెసివర్‌ ఔషధానికి డిమాండ్ పెరిగింది. గత వేవ్‌ కంటే ఇది చాలా ప్రమాదకరంగా ఉంది. అఖిలపక్ష సమావేశంలో పరిస్థితులను వివరించాం' అని ఉద్దవ్ తెలిపారు.