1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 ఏప్రియల్ 2021 (15:14 IST)

కరోనా కలకలం.. ఆ రాష్ట్రంలో 18 జిల్లాల్లో లాక్ డౌన్.. మహారాష్ట్రలోనూ..?

కరోనా దేశమంతటా మరోసారి కలకలం రేపుతోంది. రోజురోజుకూ కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దీంతో చాలా రాష్ట్రాల్లో అనేక రకాల ఆంక్షలు విధిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోనూ కరోనా తీవ్రత ఎక్కువ కావడంతో అప్రమత్తమైన ప్రభుత్వం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న 18 జిల్లాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించింది. మరోవైపు రాష్ట్రానికి వచ్చేవారు తప్పనిసరిగా కరోనా నెగిటివ్ రిపోర్టు చూపించాలనే నిబంధన తీసుకొచ్చింది.
 
దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో.. సగం ఒక్క మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా విపరీతంగా కేసులు నమోదవుతున్న తీరు.. యావత్ దేశాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా కేసులు వెల్లువెత్తుతున్న వేళ.. సంపూర్ణ లాక్‌డౌన్‌వైపే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్‌ పెట్టాలా వద్దా అన్న అంశంపై ఇప్పటికే అఖిలపక్షం.. టాస్క్‌ఫోర్స్‌ సలహాలు తీసుకున్న ఉద్ధవ్‌.. నేడు మరోసారి టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌తో సమావేశం కానున్నారు. ఆ తర్వాతే లాక్‌డౌన్‌పై ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించనున్నారు.
 
ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ మినహా వేరే గత్యంతరం లేదంటున్నారు ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే. ఈ నెల 15 నుంచి 20 వరకు పరిస్థితి భయానకంగా ఉంటుందన్న ఉద్ధవ్‌.. లాక్‌డౌన్‌తోనే కరోనాను కట్టడి చేయొచ్చని చెప్పారు. వ్యాక్సిన్‌ తీసుకున్నవారికి కరోనా పాజిటివ్‌గా వస్తోందన్నారు థాక్రే. ప్రభుత్వం ఎన్ని రకాలుగా కట్టడి చర్యలు తీసుకుంటున్నా.. కేసుల నమోదులో రోజుకో కొత్త రికార్డ్‌ సృష్టిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్ధవ్‌ సర్కార్‌ 15 రోజుల పూర్తి లాక్‌డౌన్‌ విధించే అవకాశం కనిపిస్తోంది.