1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 మే 2021 (16:05 IST)

కరోనా రెండో దశ వ్యాప్తికి బి.1.617 వేరియట్ కారణం!

దేశంలో రెండో దశ వ్యాప్తి శరవేగంగా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంతి డాక్టర్ హర్షవర్ధన్ ఆసక్తికర అంశాలు వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం అనేక కరోనా వేరియంట్లు వ్యాపిస్తున్నప్పటికీ, అన్నింట్లోకి బి.1.617 వేరియట్ అత్యంత తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతోందన్నారు. 
 
ఇది మిగతా వేరియంట్ల కంటే అధిక స్థాయిలో వ్యాపిస్తోందన్నారు. దేశంలోని 55 శాతం కొవిడ్ కేసులకు ఈ బి.1.617 వేరియంటే కారణమన్నారు. ఇతర కేంద్ర మంత్రులతో కొవిడ్ పరిస్థితులపై సమీక్ష సందర్భంగా ఆయన ఈ వివరాలు తెలిపారు.
 
సోమవారం ఉదయం నాటికి ఇన్సాకోగ్ (ఐఎన్ఎస్ఏసీఓజీ) 25,739 శాంపిల్స్‌ను పరీక్షించి, వాటిలోని కరోనా వేరియంట్ల జన్యుమార్పుల గుట్టు తెలుసుకుంది. వాటిలో 9,508 శాంపిళ్లలో బి.1.671 వేరియంట్‌ను గుర్తించింది. 
 
ఇకపైనా, కరోనా వేరియంట్ల జన్యు ఉత్పరివర్తనాల సంపూర్ణ చిత్రణ కొనసాగిస్తామని, ఆ మేరకు రాష్ట్రాల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని కేంద్రమంత్రి హర్షవర్ధన్ తెలిపారు. బి.1.617 వేరియంట్‌ను మొదటగా మహారాష్ట్రలో గుర్తించగా, ఇది అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఈ వేరియంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా దర్శనమిస్తోంది.